అజింక్యా రహానే కెప్టెన్సీలో 2020-2021లో ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీతో సహా పలువురు స్టార్ ఆటగాళ్లు సిరీస్కు పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లతో కూడిన అజింక్యా రహానే సేన ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం సృష్టించింది. అయితే తాజాగా ఆ విజయంపై నాటి కెప్టెన్ అజింక్యా రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ను కష్టపడి గెలిపించింది నేనైతే.. క్రెడిట్ మరొకరికి దక్కిందంటూ నాటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశాడు. గ్రౌండ్లో తాను తీసుకున్న సొంత నిర్ణయాలను కొందరు తమవిగా చెప్పుకున్నారని పరోక్షంగా రవిశాస్త్రిని ఉద్దేశించి రహానే వ్యాఖ్యానించాడు. కంగారులను వారి సొంత గడ్డపైనే ఓడించడంలో తాను కీలకపాత్ర పోషిస్తే ఫలితాన్ని మాత్రం మరొకరు అనుభవించారని రహానే వాపోయాడు.
Someone else took the credit for the decisions I made as a captain in the Test series in Australia, claims Ajinkya Rahane @ajinkyarahane88 @RaviShastriOfc pic.twitter.com/R70DblfAns
— The New Indian (@TheNewIndian_in) February 10, 2022
ఈ సందర్భంగా తన ఫామ్పై వస్తున్న విమర్శలపై కూడా అజింక్యా రహానే స్పందించాడు. తన పనైపోయిందని కొందరు చేసే కామెంట్లు చూస్తుంటే నవ్వొస్తుందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ పరిజ్ఞానం ఉన్న వాళ్లెవరూ అలా మాట్లాడరని ఘాటుగా వ్యాఖ్యానించాడు. కాగా ఓ ప్రముఖ క్రీడా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఫాంలో లేక సతమవుతున్న రహానే రానున్న రంజీ ట్రోఫీలో ముంబై తరఫున పృథ్వీ షా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీలో భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్కు రహానే ఎంపికయ్యే అవకాశాలున్నాయి.
కాగా 2020-2021 సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో టీమిండియా టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కావడం ఖాయమని పలువురు వ్యాఖ్యానించారు. దీనికి తోడు మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ కూడా సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. రోహిత్ శర్మ, బుమ్రా వంటి తదితరులు కూడా గాయాల కారణంగా సిరీస్లోని అన్ని మ్యాచ్లు ఆడలేదు. అయినప్పటికీ రహానే కెప్టెన్సీలోని యువ భారత్ చరిత్ర సృష్టించింది. రెండో టెస్టు మ్యాచ్లో ఘన విజయంతో సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిదైన నాలుగో టెస్టులో భారీ లక్ష్యాన్ని చేధించి మరి టీమిండియా విజయం సాధించడం గమనార్హం. దీంతో టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుని సొంత గడ్డపైనే కంగారులకు భారత్ షాకిచ్చింది.