
హైదరాబాద్: పంజాబ్కు చెందిన లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (5/31) విజృంభించడంతో ఇంగ్లాండ్ లయన్స్తో రెండో అనధికార టెస్టు మ్యాచ్లో భారత్-ఎ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో రోజు మిగిలుండగానే భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను 1-0తో ఇండియా-ఎ జట్టు కైవసం చేసుకుంది.
శుక్రవారం ఓవర్నైట్ స్కోరు 24/0తో ఫాలోఆన్ కొనసాగించిన ఇంగ్లాండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్లో 53.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేసిన మార్కండే లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒలీ పోప్(7) వికెట్తో మొదలైన మయాంక్ వికెట్ల వేట మ్యాచ్ అసాంతం కొనసాగింది.
140/5 స్కోరుతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ లయన్స్ జట్టు మార్కండే ధాటికి 40 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో ఓపెనర్ డకెట్(50) హాఫ్ సెంచరీతో రాణించగా ఆఖర్లో గ్రెగరీ(44) ఫరవాలేదనిపించాడు. భారత బౌలర్లలో జలజ్ సక్సేనా రెండు, నవదీప్ సైని, షాబాజ్ నదీమ్, వరుణ్ అరోన్ తలా ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో లయన్స్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 144 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 392 పరుగులు చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్లో తొలి టెస్టు డ్రాగా ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 392 ఆలౌట్,
ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్: 144 ఆలౌట్,
రెండో ఇన్నింగ్స్: 180 ఆలౌట్(డకెట్ 50, గ్రెగరీ 44, మయాంక్ 5/31, సక్సేనా 2/40)