తొలి వన్డేలో కేవలం 44 పరుగులే
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కేవలం 44 పరుగులే చేసి ఔటైన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత నాగ్పూర్లో జరిగిన రెండో వన్డేలో 116, రాంచీ వన్డేలో 123 పరుగులతో సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లీ 41 సెంచరీలు సాధించాడు. ఆదివారం మొహాలి వేదికగా ప్రారంభమైన నాలుగో వన్డేలో కోహ్లీ సెంచరీలు సాధిస్తే? వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు.
వెస్టిండీస్తో 2018లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో
వెస్టిండీస్తో 2018లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో 140, 157*, 107 పరుగులతో విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకూ వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), గిబ్స్(దక్షిణాఫ్రికా), రాస్ టేలర్ (న్యూజిలాండ్)లు ఉన్నారు.
వరుసగా నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా
ఇక వరుసగా నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర తన పేరిట రికార్డు నెలకొల్పాడు. కాగా, రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్ 63.
ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు
దీంతో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కెప్టెన్గా ఏబీ డివిలియర్స్కు నాలుగువేల పరుగులు సాధించడానికి 77 ఇన్నింగ్స్లు పట్టాయి. 100 ఇన్నింగ్స్ల్లో నాలుగువేల పరుగులు చేసిన ధోని ఈ జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డేల్లో కెప్టెన్గా నాలుగువేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.