
హైదరాబాద్: మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ఓపెనర్లు ప్రత్యర్ధి జట్టు బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మైదానంలో పరుగుల వరద పారించారు.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ భారీ స్కోరుకు పునాది వేశారు. నిలకడగా ఆడుతున్న వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత పరుగుల వేగం పెంచారు. బౌండరీలు బాదుతూ ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ధావన్ 97 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ సాధించాడు.
వన్డేల్లో ధావన్కి ఇది 16వ సెంచరీ కాగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సెంచరీకి చేరువగా వచ్చిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ(95: 92 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అనూహ్యంగా 31వ ఓవర్లో రిచర్డ్సన్ బౌలింగ్లో పీటర్ హ్యాండ్స్ కోంబ్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(115), రాహుల్(10) పరుగులతో క్రీజులో ఉన్నారు. మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత్ తుది కోహ్లీ నాలుగు మార్పులు చేశాడు. ధోనికి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో రిషబ్ పంత్కి చోటిచ్చాడు. పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్న అంబటి రాయుడిపై వేటు వేసి అతని స్థానంలో కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్, జడేజా స్థానంలో చాహల్కి తుది జట్టులో చోటిచ్చాడు.