అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక్క రోజు, రెండో రోజుల కాదు.. ఏకంగా అయిదు రోజులు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. తొలి మూడు రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు ఉదయం, మధ్యాహ్నం; రెండో రోజు ఉదయం, సాయంత్రం; మూడో రోజు ఉదయాన వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగో రోజు చిన్నపాటి జల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. ఇక చివరి రోజూ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అయితే భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్ష సూచనలు లేకపోవడం కాస్త సంతోషకరం.
సాధారణంగా గబ్బాలో పేసర్లకు అనుకూలిస్తుంది. మూడో టెస్టుకు సంప్రదాయమైన గబ్బా వికెట్ను రూపొందించామని పిచ్ క్యురేట్ చెప్పాడు. పేస్, వేగం ఉండేలా బౌన్సీ పిచ్ను సిద్ధం చేశారని తెలిపాడు. కాగా, గబ్బాలో వర్షం కూడా తోడైతే బ్యాటర్లకు అత్యంత సవాలుగా మారే అవకాశం ఉంటుంది. కాగా, క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన అయిదు టెస్టుల్లో మూడింట్లో పరాజయం పాలైంది. ఇందులో గత మూడేళ్లలోనే రెండు ఓటమలు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ విజయం సాధించింది. 1988 నుంచి గబ్బాలో ఓటమెరుగని కంగారూలను మట్టికరిపించింది.