సిడ్నీ: మూడు టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో చివరిదైన మూడో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సంజూ శాంసన్కు బదులు మనీష్ పాండే ఆడుతాడని అందరూ అనుకున్నా.. కోహ్లీ మాత్రం కేరళ బ్యాట్స్మన్వైపే మొగ్గుచూపాడు. మరోవైపు ఆసీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ ఆడుతున్నాడు. మార్కస్ స్టాయినిస్ స్థానంలో ఫించ్ జట్టులోకి వచ్చాడు.
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి ఆస్ట్రేలియా జట్టును వైట్వాష్ చేయాలని చూస్తోంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన ఫించ్ సేన దీనిలో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్లో పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లో ఇదే చివరిది అయినందున.. టెస్టు సిరీస్లోకి అడుగుపెట్టేముందు విజయంతో వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్లో రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆసీస్ గడ్డపై భారత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. అదేంటంటే.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్లు కలిగిన టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేయడం. 2016లో ధోనీ సారథ్యంలో టీమిండియా 3-0 తేడాతో ఘన విజయం సాధించి ఆ జట్టును క్లీన్స్వీప్ చేయగా.. అంతకన్నా ముందే ఏంజిలో మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక 2013లో 2-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో ఆస్ట్రేలియా సొంత గడ్డపైనే రెండుసార్లు వైట్వాష్కు గురైంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నడిపిస్తున్న భారత జట్టు సైతం అదే రికార్డుపై కన్నేసింది.
జట్లు:
భారత్ : శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, టీ నటరాజన్, యుజవేంద్ర చహల్.
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, డీ ఆర్కీ షార్ట్, మోయిసిస్ హెన్రిక్స్, డానియల్ సామ్స్, సీన్ అబాట్, మిచెల్ స్వెప్సన్, ఆండ్రూ టై, ఆడం జంపా.
India vs Australia: మూడో టీ20.. ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లీ!!