బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. నేటి నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తలపడనుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది. అడిలైడ్లో ఇప్పటివరకు ఏడు డే/నైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా అన్నింట్లోనూ గెలిచింది.
మరోవైపు భారత్ ఓవరాల్గా నాలుగు పింక్ బాల్ టెస్టులు ఆడగా మూడింట్లో నెగ్గింది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, శ్రీలంకపై విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా ఆసీస్తో ఆడిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఈ పోరులోనే 36 పరుగులకే కుప్పకూలి క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నేటి మ్యాచ్తో ఈ చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

కాగా, టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపాడు. ''పిచ్ బాగుంది. పొడిగా కనిపిస్తుంది, అలాగే వికెట్పై తగినంత గడ్డి కూడా ఉంది. ఫాస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. ఆట కొనసాగే కొద్ది బ్యాటింగ్కు అనుకూలంగా మారుతుందనకుంటున్నాను''
''జట్టులో మూడు మార్పులు జరిగాయి. నేను, గిల్, అశ్విన్ తుదిజట్టులోకి వచ్చాం. సుందర్, పడిక్కల్, జురెల్ చోటు కోల్పోయారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాను. ఇది కాస్త భిన్నమైనది. కానీ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నాను'' అని రోహిత్ శర్మ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా తుదిజట్టులో ఓ మార్పు జరిగింది. గాయం కారణంగా దూరమైన హేజిల్వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ జట్టులోకి వచ్చాడు.
భారత్: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మెక్స్వీనే, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్.