|
బదులు తీర్చుకున్న పాండ్యా
బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ బ్యాట్స్మన్ మాక్స్వెల్ ‘హ్యాట్రిక్ సిక్సర్ల'కి ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా బదులు తీర్చుకున్నాడు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి మ్యాక్స్ వెల్ (19) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఔట్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. పాండ్యా వేసిన బంతిని ఆడే క్రమంలో మ్యాక్స్వెల్ బ్యాట్ని అడ్డుపెట్టినప్పటికీ, అది గిర్రున తిరుగుతూ వికెట్లను గిరాటేసింది.
ట్విట్టర్లో పోస్టు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా
ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో పాండ్యా బౌలింగ్లో మ్యాక్స్వెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్లో మొత్తం నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన 55 పరుగులిచ్చిన పాండ్యా
తొలి టీ20లో పాండ్యా తన 4 ఓవర్ల వేసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రెండో టీ20 తుది జట్టులో పాండ్యా స్థానంలో చాహల్కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, జట్టు మేనేజ్మెంట్ మాత్రం ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
రెండో టీ20లో వరుణుడు అంతరాయం
కాగా, రెండో టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. ప్రస్తుతం మెల్బోర్న్లోనూ 19వ ఓవర్ ముగిసిన తర్వాత చినుకులు కాస్త భారీ వర్షంగా మారడంతో ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 132/7తో ఉంది. బెన్ మెక్డెర్మాట్ (32), ఆండ్రూ టై (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి టీ20లో సరిగ్గా 17 ఓవర్ సమయంలో వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే.