
హైదరాబాద్: మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో తొలి ఓవర్లోనే ఆసీస్కు ఎదురు దెబ్బ తగిలింది
కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెండో బంతికే వెనుదిరిగాడు. భువీ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని ఎదుర్కొన్న ఆరోన్ ఫించ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు నేరుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. క్రీజులో డార్షీ షార్ట్(8), క్రిస్ లిన్ (7) పరుగులతో ఉన్నారు.
మూడు టీ20ల సిరిస్లో ఈ మ్యాచ్ కోహ్లీసేనకు ఇది చావోరేవో కానుంది. ఈ సిరీస్లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టీ20లో స్వల్ప మార్పులు ఉంటాయని అంతా భావించారు.
అయితే, కోహ్లీ మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడిన బిల్లీ స్టాన్లేక్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్కు తుది జట్టులో చోటు కల్పించింది.
ఈ సిరిస్లో ఇప్పటికే 1-0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... ఈ మ్యాచ్లోనైనా గెలిచి మూడు టీ20ల సిరీస్ని 1-1తో సమం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక, ఆస్ట్రేలియా జట్టులో హిట్టర్లు క్రిస్లిన్, మాక్స్వెల్ సూపర్ ఫామ్లో ఉండగా బౌలింగ్లో ఆడమ్ జంపా, స్టాయినిస్ చక్కగా రాణిస్తున్నారు.
దీంతో వరుసగా రెండో టీ20లోనూ గెలిచి సిరీస్ను 2-0తో చేజిక్కించుకోవాలని ఆతిథ్య జట్టు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్కీ వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 16టీ20లాడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్ల్లో విజయం సాధించింది. మిగిలిన ఆరు మ్యాచ్ల్లో ఆసీస్ విజయం సాధించింది.
ఇక, ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఏడు టీ20లు ఆడగా, అందులోనూ నాలుగింట భారత్ విజయం సాధించింది.