|
మ్యాక్స్వెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు
భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మ్యాక్స్వెల్(113 నాటౌట్) సెంచరీకి తోడు డీఆర్సీ షార్ట్(40)లు రాణించడంతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. గతకొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్న మ్యాక్స్వెల్ ఈ సిరిస్తో ఫామ్లోకి వచ్చాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు రెండో టీ20లో సెంచరీ సాధించిన మ్యాక్స్వెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.
టాస్ ఓడి బ్యాటింగ్
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ కేఎల్ రాహుల్, చివర్లో ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుటయ్యాడు.
రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(1) స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరి నిరాశపరచగా... మరో ఓపెనర్ శిఖర్ ధావన్(14) వెంట వెంటనే పెవిలియన్కు చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది.
టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెచంరీ. ఇక, విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో నెమ్మదిగా ఆడి విమర్శలు పాలైన ధోని ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు.