హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసి ఆలౌటైంది.
విజయ లక్ష్యం సాధించతగ్గతే అయినప్పటికీ ఆస్ట్రేలియా పేలవంగా ఆడింది. వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో స్మిత్ (59), హెడ్ (39) పరుగులు చేయగా స్టోయినిస్ (62 నాటౌట్) పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ హ్యాట్రిక్ తీయగా... భువనేశ్వర్ 3, చాహల్, పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆసీస్ ఇన్నింగ్స్ సాగిందిలా:
హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్
ఈడెన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 32వ ఓవర్లో కుల్దీప్ ఈ ఘనత సాధించాడు. దీంతో వరుసగా మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 32వ ఓవర్లో కుల్దీప్ విసిరిన 2వ బంతికి మాథ్యూ వేడ్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఆస్టన్ అగర్ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. అగర్ తర్వాత ప్యాట్ కమిన్స్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఇలా మూడు వికెట్లు వరుసగా తీసి కుల్దీప్ తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకున్నాడు. హ్యాట్రిక్ తీసిన కుల్దీప్ను సహచర ఆటగాళ్లు మైదానంలోనే అభినందించారు. మరోవైపు ఈడెన్ గార్డెన్స్ ఒక్కసారిగా అభిమానుల హర్షధ్వానాలతో మిన్నంటింది.
స్మిత్ అవుట్: ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
భారత్తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా కీలకమైన ఐదో వికెట్ కోల్పోయింది. 29.5 ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతికి కెప్టెన్ స్మిత్ 59 (76 బంతుల్లో) జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రీజులో నిలకడగా ఆడిన స్మిత్ తన కెరీర్లో 18వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. స్మిత్ అవుటైన తర్వాత వేడ్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 30 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. స్టోయినిస్ (13), వేడ్ (0) క్రీజులో ఉన్నారు.
100వ వన్డేలో స్మిత్ హాఫ్ సెంచరీ
కెరీర్లో 100వ వన్డే ఆడుతున్న స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 6 ఫోర్లు సాయంతో స్మిత్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ సిరిస్లో ఆస్ట్రేలియా జట్టు నమోదు చేసిన తొలి హాఫ్ సెంచరీ ఇదే కాగా, స్మిత్కు 18వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. దీంతో 29 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. స్మిత్ (55), మార్కస్ స్టోయినిస్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ను కోల్పోయిన ఆస్ట్రేలియా
ఈడెన్లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ను కోల్పోయింది. 22.5వ ఓవర్లో చాహల్ విసిరిన బంతిని వికెట్ కీపర్ ధోని అందిపుచ్చుకుని స్టంప్స్ని గిరాటేయడంతో గ్లెన్ మాక్స్వెల్ (14) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ అవుటైన తర్వాత మార్కస్ స్టోయినిస్ క్రీజులోకి వచ్చాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి హెడ్ (39) మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన స్మిత్, హెడ్ జోడీని విడదీసేందుకు కోహ్లీ వేసిన స్పిన్ మంత్రం ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుతం 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (39), మాక్స్వెల్(12) పరుగులతో ఉన్నారు.

9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే కష్టాల్లో పడింది. 9 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. మూడో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ కార్ట్రైట్(1) క్లీన్ బౌల్డ్ అవ్వగా.. మరో ఓపెనర్ వార్నర్ (1) 4.5 ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరారు. ఈ రెండు వికెట్లను భువినే దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్మిత్(6), హెడ్ (0) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.
ఆసీస్ విజయ లక్ష్యం 253
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్కు 253 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. 47.3 ఓవర్ వద్ద వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.
వర్షం కాస్త తెరిపినినవ్వడంతో తిరిగి ఆట ప్రారంభమైన వెంటనే టీమిండియా వెనువెంటనే మిగతా వికెట్లను కోల్పోయింది. ఆట తిరిగి ప్రారంభం కాగానే అప్పటికి క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా (20), భువనేశ్వర్ కుమార్ (20) వికెట్లను కోల్పోయింది. భువీ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కుల్దీప్ యాదవ్ వచ్చీ రాగానే కమిన్స్ వేసిన బంతిని వేడ్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యుజువేంద్ర (1)ను వేడ్ రనౌట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 10 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, రిచర్డ్సన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... కమ్మిన్స్, అగర్ చెరో వికెట్ తీశారు.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
రెండో వన్డేకి వర్షం అంతరాయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేకి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్ని నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 47.3 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. పాండ్యా(19), భువీ(18) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వన్డేలో పాండ్యాకు గాయం
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా స్వల్పంగా గాయపడ్డాడు. 46.4వ ఓవర్ వద్ద నైల్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ షాట్కు ప్రయత్నించగా.. ఆ బంతి ఇంకో ఎండ్లో ఉన్న హార్దిక్ పాండ్యా హెల్మెట్ను తాకింది. దీంతో కిందపడిన పాండ్యా కాసేపు అలానే ఉండిపోయాడు. మరోవైపు ప్రస్తుతం భారత్ 47 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 204 పరుగుల వద్ద ధోని (5) రూపంలో భారత్ వికెట్ కోల్పోయింది. 39.1 ఓవర్ వద్ద రిచర్డ్సన్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ధోని పెవిలియన్కు చేరాడు. ధోని అవుటైన తర్వాత భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 40 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. పాండ్యా(2), భువీ(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

సెంచరీ మిస్ చేసుకున్న విరాట్ కోహ్లీ
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 186 పరుగుల వద్ద జాదవ్ (24) వికెట్ కోల్పోయిన భారత్ 197 పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ (92) అవుటయ్యాడు. దీంతో మరో ఎనిమిది పరుగుల్లో సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లీ చేజార్చుకున్నాడు. 107 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో కోహ్లీ 92 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. కోహ్లీ అవుటైన తర్వాత పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. పాండ్యా(4), ధోనీ(4) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 35.3వ ఓవర్ వద్ద నైల్ బౌలింగ్లో జాదవ్ (24) మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పాండే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జాదవ్ తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత పరుగుల వరద పారించాడు. 34వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన జాదవ్.. 35వ ఓవర్లో సిక్స్ బాదాడు. కోహ్లితో కలిసి నాలుగో వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం భారత్ 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కోహ్లీ(85), ధోనీ(4) క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే (3) పరుగుల వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. పాండే అవుటైన తర్వాత కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు. ఇక, కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 30 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కోహ్లీ (68), జాదవ్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 121 పరుగుల వద్ద రహానే (55) అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
అంతకముందు రోహిత్ శర్మ(7) ఆదిలోనే పెవిలియన్కు చేరగా రహానేకు జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్ను నడిపించాడు. అయితే అనవసర పరుగు కోసం యత్నించిన రహానే(55) రనౌట్ అయ్యాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం 24 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో ధోని 53, పాండ్యా పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రహానే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ, రహానేలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తొలి వన్డేలో విఫలమైన వీరిద్దరూ రెండో వన్డేలో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. తొలుత కోహ్లీ 60 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ చేయగా, ఆపై రహానే 62 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
నిలకడగా ఆడుతున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. 19 పరుగులకే రోహిత్ శర్మ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఓపెనర్ రహానే (34), కెప్టెన్ కోహ్లీ (28) నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నారు. సింగిల్స్, ఫోర్లు తీస్తు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.
10 ఓవర్లకు భారత్ 44/1
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 10 ఓవర్లకు గాను వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే (27), విరాట్ కోహ్లీ (7) పరగులతో క్రీజులో ఉన్నారు.
19 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 5.1వ ఓవర్ వద్ద కౌల్టర్ నైల్ వేసిన బంతిని ఎదుర్కొన్న రోహిత్(7) అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో భారత్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే(15), కోహ్లీ(1) పరుగులతో ఉన్నారు. తొలి వన్డేలో కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా కోహ్లీసేన బరిలోకి దిగుతోంది.
గత కొన్ని రోజులుగా కోల్కతాలో వర్షాలు కురుస్తుండటంతో పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. మరోపక్క ఆసీస్ మాత్రం జట్టులో రెండు మార్పులు చేసింది. ఫాల్కనర్, జంపా స్థానంలో రిచర్డ్సన్, అగర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఈ వన్డే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే స్టీవ్ స్మిత్కు ఇది 100వ వన్డే. ఈ స్టేడియంలో స్మిత్కు గతంలో ఆడిన అనుభం లేదు. దీంతో ఈ పిచ్పై జరిగిన మ్యాచ్లకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే చూశానని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు.
తొలి వన్డేలో గెలిచి ఊపుమీదున్న టీమిండియా రెండో వన్డేలో కూడా ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ వన్డేలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో కనుక కోహ్లీసేన విజయం సాధిస్తే ఐదు వన్డేల సిరిస్లో పట్టు చిక్కినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు గత కొన్ని రోజులుగా కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ వన్డేకి వరుణుడి ముంపు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం మ్యాచ్కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మనీష్ పాండే, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బూమ్రా
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్(కెప్టెన్), రోహిత్ శర్మ, కార్ట్ రైట్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోనిస్, మాథ్యూవేడ్, ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్ సన్, పాట్ కమిన్స్, నాదన్ కౌల్టర్ నైల్