రాజ్కోట్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల రెండో వన్డే జరుగుతుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదటగా బ్యాటింగ్ చేస్తోంది. ఈ వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 81 పరుగుల దగ్గర ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ 42 (44 బంతుల్లో ఆరు ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా రోహిత్ వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీకి చేరువలో రోహిత్ ఔట్ అవ్వడంతో.. అతని అభిమానులు నిరాశకు గురయ్యారు.
రోహిత్ శర్మ మరో 4 పరుగులు చేసి ఉంటే.. 9000 పరుగుల క్లబ్లో చేరేవాడు. మూడో వన్డేలో 4 పరుగులు చేస్తే.. అత్యంత వేగంగా 9000 పరుగులు సాధించిన మూడో క్రికెటర్గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ క్రమంలో సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం రోహిత్ 216 ఇన్నింగ్సుల్లో 8,996 పరుగులతో ఉన్నాడు.
జంపా బౌలింగ్లో వన్డేలు, టీ20ల్లో కలుపుకుని రోహిత్ ఔట్ కావడంతో ఇది నాలుగోసారి. దాంతో విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. జంపా బౌలింగ్లో కోహ్లీ (వన్డేలు, టీ20లు) ఆరు సార్లు పెవిలియన్ చేరాడు. ఒక బ్యాట్స్మన్ను ఎక్కువసార్లు ఔట్ చేసిన జంపా బౌలింగ్ గణాంకాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు.
రోహిత్-శిఖర్ ధావన్ జోడి తొలి వికెట్కు 81 పరుగులు జోడించింది. రోహిత్ పెవిలియన్ చేరినా.. టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. కోహ్లీ, ధావన్ ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా ధావన్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ జోడి ఇప్పటికే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 27 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోయి 171 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ (87), కోహ్లీ (31) పరుగులతో ఉన్నారు.