
టాప్ ఆర్డర్ గర్జించాల్సిందే:
ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఇద్దరూ మరోసారి శుభారంభం ఇవ్వాలని టీమిండియా కోరుకుంటోంది. ఆస్ట్రేలియా జట్టుపై కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు లేదు. గత కొన్ని ఇన్నింగ్స్లలో కోహ్లీ పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నాడు. భారత్ సిరీస్లో నిలవాలంటే కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఐపీఎల్ 2020లో పరుగుల వరద పారించినా.. సిడ్నీలో మాత్రం తేలిపోయారు. ఈ ఇద్దరూ కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు.

బుమ్రా మెరిస్తేనే:
సిడ్నీ వన్డేలో హార్దిక్ పాండ్యా 76 బంతుల్లో 90 పరుగులతో గొప్పగా పోరాడాడు. అయితే హార్దిక్ బౌలింగ్కు దూరంకావడంతో జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాకప్ ఆల్రౌండర్ లేకపోవడం టీమిండియాకి ఇబ్బందిగా మారింది. ఐదుగురు బౌలర్లతోనే కోహ్లీ జట్టును నడిపించాల్సి ఉంది. గాయం నుంచి కోలుకొని న్యూజిలాండ్ సిరీస్తో జట్టులో చేరిన బుమ్రా వన్డేలో తన ఫామ్ను కొనసాగించట్లేదు. ఐపీఎల్లో మెరిసినప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటలేకపోతున్నాడు. కాగా షమీ కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటం భారత్కు ఊరట. అతడితో పాటు బుమ్రా కూడా మెరిస్తే ఆస్ట్రేలియా స్కోరును పరిమితం చేయవచ్చు.

శార్దూల్, కుల్దీప్కు అవకాశం:
తొలి మ్యాచ్లో సైనీ, చహల్ కలిసి 20 ఓవర్లలో 172 పరుగులు ఇచ్చారు. అయితే చహల్ తన స్పెల్ ముగిసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. సైనీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వారిద్దరు రెండో మ్యాచ్కు ఫిట్నెస్ సాధించకపోతే.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తారు. మరో పేసర్ టీ నటరాజన్ జట్టులో ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ కూడా చేయగలిగే శార్దూల్కు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సూపర్ ఫామ్లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లను భారత బౌలింగ్ దళం ఎలా కట్టడిచేస్తుందో చూడాలి. మరోవైపు ఫీల్డింగ్ పొరపాట్లు కూడా కోహ్లీసేన సరిదిదద్దుకోవాల్సిన అవసరం ఉంది.

ఫేవరేట్గా ఆసీస్:
మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు ఎలాంటి సమస్య లేదు. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ అదరగొడుతున్నారు. గ్లెన్ మాక్స్వెల్ కూడా ఫామ్ అందుకున్నాడు. వీరిలో ఏ ఇద్దరు నిలిచినా భారీ స్కోర్ ఖాయం. స్టాయినిస్, కేరీలు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కమిన్స్, స్టార్క్, జంపా, హేజిల్వుడ్లతో కూడిన పటిష్ట బౌలింగ్ లైనప్ ఉంది. మొత్తానికి ఆసీస్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంటే.. భారత్ ఒత్తిడిలో ఉంది.

జట్లు (అంచనా):
భారత్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ/శార్దూల్ ఠాకూర్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్/కామెరన్ గ్రీన్, అలెక్స్ కేరీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, జోష్ హేజిల్వుడ్.