హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్లను ముగించడం చూస్తుంటే చాలా బాగుంటుందని దినేశ్ కార్తీక్ అన్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ప్రదర్శనపై దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్లలో ధోని (55), కార్తీక్ (25) చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఒక రోజు ఖాళీ సమయం దొరకడంతో రోహిత్, దినేశ్ కార్తీక్ ఏం చేశారో తెలుసా?
మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ "ఈ సిరీస్లో ధోని సూపర్ ఫామ్లో ఉన్నాడు. ధోని మ్యాచ్లను ముగించడం చూస్తుంటే చాలా బాగుంటుంది. ఒత్తిడిని జయించి తర్వాత దానిని ప్రత్యర్థిపై నెట్టేస్తాడు. అతడే అతడి బలం. మళ్లీ రెండో వన్డేలో దాన్ని చూశాం. చివరి ఓవర్లో ఒక షాట్ బాదేస్తే విజయం సాధిస్తామని మా ఇద్దరికీ తెలుసు" అని అన్నాడు.
"అందుకే ధీమాగా ఉన్నాం. మ్యాచ్లు ముగించడం కోసం ప్రాక్టీస్ చేశా. ఇంకా నేర్చుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన నైపుణ్యం. కష్టమైంది కూడా. ప్రస్తుతం జట్టులో నా పాత్రేమిటో జట్టు యాజమాన్యం చెప్పింది. మ్యాచ్లు ముగించాలని సూచించారు. ప్రోత్సహిస్తున్నారు. అందుకు తగినట్టే కష్టపడుతున్నా" అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.