
సిడ్నీ: త్వరలోనే సొంతగడ్డపై టీమిండియాతో జరగనున్న సుదీర్ఘ సిరీస్లో తాను సహనం కోల్పోనని ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. భారత ఆటగాళ్లు తనను కవ్వించినా.. కూల్గానే ఉంటానని, బ్యాట్తోనే సమాధానం చెబుతా అని వార్నర్ అన్నాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా శుక్రవారం జరగనున్న తొలి వన్డేతో పర్యటన మొదలవనుంది. సిడ్నీలో క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఇరు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నారు.
తాజాగా డేవిడ్ వార్నర్ ఓ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ... 'మేము చివరిసారి భారతదేశంలో పర్యటించినప్పుడు వారు మమ్మల్ని కవ్వించారు. గతంలో ఎంతో దూకుడుగా ఉండేవాడిని. అయితే గత కొంత కాలంగా ఎంతో నేర్చుకున్నా. ఇప్పుడు భారత ఆటగాళ్లు నన్ను కవ్వించినా.. కూల్గానే ఉంటా. నా బ్యాటే మాట్లాడుతుంది. సహనం కోల్పోతే సహచరులపై ప్రభావం పడుతుంది. కాబట్టి మనం కొంచెం వినయంగా ఉండాలి. ప్రత్యర్థి పట్ల మరింత గౌరవంగా ఉండాలి' అని అన్నాడు. పిల్లల మాట విననప్పుడు సహనంతో ఉండాలని, కోపం తెచ్చుకోవద్దని వార్నర్ తెలిపాడు. మైదానంలోనూ కవ్వింపులకు స్పందించబోనని వార్నర్ చెప్పుకొచ్చాడు.

డేవిడ్ వార్నర్ గతంలో ఎంతో దూకుడుగా ఉండేవాడు. సై అంటే సై అనేలా ఉండేవాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడంలోనైనా, ఎవరితోనైనా గొడవలకు దిగడంలో ముందుండేవాడు. కానీ పరిణతి సాధించిన వార్నర్.. కొంత కాలంగా కూల్గా ఉంటున్నాడు. 2018లో బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఏడాది పాటు నిషేధం వేటు ఎదుర్కొన్న వార్నర్.. ఆ తర్వాత ఎంతో మారిపోయాడు. ఇక తండ్రి కావడం కూడా వార్నర్లో మార్పునకు కారణమైంది. ఇప్పుడు అంతా కూల్, కూల్ అంటున్నాడు. ఐపీఎల్ 2020లో కూడా వార్నర్ ఎప్పుడూ కూల్గానే ఉన్నాడు.
టెస్టు సిరీస్లో తనకు జోడీగా ఎవర్ని ఓపెనర్గా బరిలో దింపాలనే విషయమై డేవిడ్ వార్నర్ స్పదించాడు. '12 మంది ఆటగాళ్లు నాతో ఓపెనింగ్ భాగస్వామిగా బరిలో దిగారు. అయితే చాలా మంది నిలకడగా ఆడలేకపోయారు. ఓపెనింగ్ జోడీగా ఎవరైతే నాకు సౌకర్యవంతంగా ఉంటుందోనని సెలక్టర్లు అడుగుతున్నారు. జో బర్న్స్ నాకు చాలా కాలంగా తెలుసు. ఒకరి ఆట గురించి మరొకరికి అవగాహన ఉంది. జోతో కలిసి కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నాను. కానీ సరైన వ్యక్తిని తీసుకోవడం అనేది సెలెక్టర్ల ఇష్టం. వాళ్లు కొత్త కుర్రాడు విల్ వైపు మొగ్గినా ఫర్వాలేదు. అతడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఓ ఆటగాడు జట్టులోకి రావడం కంటే.. బయటకు వెళ్లడం కష్టం. సెలక్టర్లు ఎవర్నీ ఆడించినా.. మరో ఓపెనర్గా బరిలో దిగిన వ్యక్తి తన పని తాను చేసినంత వరకు నాకు సమ్మతమే, ఆనందమే' అని అన్నాడు.