ఆసియాలో ఆస్ట్రేలియా విజయ పరంపరకు కోహ్లీసేన అడ్డుకట్టు
9 - ఈ విజయంతో ఉపఖండంలో ఆస్ట్రేలియా వరుస విజయ పరంపరకు టీమిండియాకు అడ్డుకట్ట వేసింది. ఉపఖండంలో ఆస్ట్రేలియా జట్టు చివరగా నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో గతేడాది టీమిండియాతో జరిగిన సిరీస్లో మ్యాచ్లో ఓడిపోయింది. ఆ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచ్లను గెలిచి ఐదు వన్డేల సిరిస్ను 3-2తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత యుఏఈలో జరిగిన సిరీస్లో పాకిస్థాన్ను 5-0తో వైట్ వాష్ చేసింది. ఈ సిరిస్లో భాగంగా ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా వరుసగా 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన
రెండో వన్డేలో కేఎల్ రాహుల్ సాధించిన 80 పరుగులు... 150కిపైగా స్ట్రయిక్ రేట్తో ఓ భారత వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోరు. పాకిస్థాన్పై 2006 లాహోర్ వన్డేలో 46 బంతుల్లో 156.52 స్ట్రైక్ రేట్లో ధోని అజేయంగా 72 పరుగుల రికార్డుని కేఎల్ రాహుల్ అధిగమించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే మూడు ఫీల్డింగ్ డిస్మసల్స్తో పాటు ఒక మ్యాచ్లో 150కిపైగా స్ట్రైక్ రేట్లో కేఎల్ రాహుల్ కంటే అత్యధిక స్కోరు నమోదు చేశాడు. అతడే జోస్ బట్లర్. వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ 77 బంతుల్లో 150 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ - 7000
భారత క్రికెటర్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేల పరుగులు సాధించిన ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. గతంలో హషీమ్ ఆమ్లా (147 ఇన్నింగ్స్) పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ కేవలం 137 ఇన్నింగ్స్లోనే అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 160 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా భారత్ నుంచి 7000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంగూలీ, సెహ్వాగ్ కూడా ఉన్నారు. మరో నాలుగు పరుగులు చేసి ఉంటే వన్డేల్లో రోహిత్ మొత్తం 9 వేల పరుగులు పూర్తి చేసేవాడు.
కుల్దీప్ యాదవ్ - 100 వికెట్లు
ఈ మ్యాచ్లోనే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం అరుదైన రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్గా ఈ చైనామన్ బౌలర్ గుర్తింపు పొందాడు. తన 58వ మ్యాచ్లో కుల్దీప్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక అంతకు ముందు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 76 మ్యాచ్ల్లో ఈ ఫీట్ను నెలకొల్పాడు. ఓవరాల్గా ఈ ఘనతనందుకున్న మూడో బౌలర్ కుల్దీప్. మహ్మద్ షమీ(56), బుమ్రా(57).. ఈ మణికట్టు స్పిన్నర్ కంటే ముందు తక్కువ మ్యాచ్ల్లో 100 వికెట్లు పడగొట్టారు.
విరాట్ కోహ్లీ - 4000
4009 - ఆస్ట్రేలియాతో జరిగిన అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 4000 పరుగులు చేసిన 7వ ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాపై 6707 పరుగులతో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
కేఎల్ రాహుల్ - 1000
రెండో వన్డేలో 80 పరుగులతో రాణించి మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అందుకున్న రాహుల్.. వన్డే ఫార్మాట్లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వన్డే ఫార్మాట్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన నాలుగో ఇండియన్ బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. రాహుల్ 27 మ్యాచ్ల్లోనే ఈ ఫీట్ సాధించగా.. కోహ్లి, ధావన్ 24 మ్యాచ్ల్లో వెయ్యి పరుగులు పూర్తిచేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ (25 మ్యాచ్ల్లో) రాహుల్ కన్నా ముందున్నాడు.
రాజ్ కోట్లో టీమిండియాకు తొలి విజయం
భారత జట్టుకు రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఇదే తొలి విజయం. గతంలో జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(98), లబుషేన్(44) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు
ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన ఒక్క బ్యాట్స్మన్ కూడా సెంచరీ సాధించలేదు. అయినప్పటికీ అత్యధిక పరుగులు నమోదు చేసిన మ్యాచ్గా ఈ వన్డే రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి మొత్తం 644 పరుగులు నమోదు చేశాయి.