
హైదరాబాద్: నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో రెండు వేల పరుగుల్ని సాధించడంతో పాటు 150కిపైగా వికెట్లు సాధించిన మూడో భారత క్రికెటర్గా గుర్తింపు సాధించాడు.
మంగళవారం ప్రారంభమైన రెండో వన్డేలో జడేజా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత ఇన్నింగ్స్లో భాగంగా గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన 41 ఓవర్ రెండో బంతికి పరుగు చేయడం ద్వారా వన్డేల్లో రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.
దీంతో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్దేవ్ల సరసన నిలిచాడు. సచిన్ 18,426 వన్డే పరుగుల్ని సాధించగా, 154 వన్డే వికెట్లు సాధించాడు. ఇక, కపిల్దేవ్ 3,782 వన్డే పరుగుల్ని సాధించడంతో పాటు 253 వన్డే వికెట్లు తీశాడు. తాజాగా జడేజా రెండువేల పరుగులతో పాటు 150కిపైగా వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్గా జడేజా నిలిచాడు.
ప్రస్తుతం జడేజా ఖాతాలో 2,011 వన్డే పరుగులతో పాటు 171 వికెట్లు ఉన్నాయి. రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో జడేజా 21 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాకు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్ నైల్, మాక్స్వెల్, నాథన్ లయాన్ తలో వికెట్ తీశారు.