అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. కోహ్లీని తిట్టడం లాంటి వాటి గురించి మేమెందుకు మాట్లాడతాం..ఇదంతా రబ్బిష్ అని పేర్కొన్నాడు. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్ వేదికగా తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 2018-19 పర్యటనలో 2-1తో సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... విరాట్ కోహ్లీని కట్టడి చేయడంతో పాటు టీమిండియాపై అమలు చేయనున్న ప్రణాళికలను వెల్లడించాడు. 'మరో రెండు రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాపై గెలిచేందుకు మా ప్రణాళికలను రచించుకున్నాం. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలనే దానిపై చర్చించుకున్నాం. అంతేకాని కోహ్లీని తిట్టడం వాటి గురించి మేమెందుకు మాట్లాడతాం, ఇదంతా రబ్బిష్. మేము కేవలం అతని నైపుణ్యంపైనే దెబ్బతీస్తాం. అంతేతప్ప ఎమోషన్స్తో ఆడుకోం. మాకు ఎమోషన్స్ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు సాగుతాం' అని లాంగర్ తెలిపాడు.
'విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు మంచి కెప్టెన్ కూడా. విరాట్ టీమిండియాకు చాలా విలువైన ఆటగాడు. ఫామ్లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకుండదు. అతడు చుక్కలు చూపిస్తాడు. నాకు అతనిపై చాలా గౌరవం ఉంది. కానీ అతన్ని అవుట్ చేస్తేనే మా పని సులువుగా జరిగిపోతుంది. విరాట్ ఒక్క టెస్టు మ్యాచ్కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయం తెలుసు. అందుకే ఆ టెస్టులో పరుగులు చేయకుండా.. ఎలా ఔట్ చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం' అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోనున్న సంగతి తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండడంతో అతడు ఇండియా రానున్నాడు. పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వెళ్లనున్న కోహ్లీ స్థానంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇక లోకేశ్ రాహుల్ను నాలుగో స్థానంలో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నది.
తొలి టెస్టుకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్కు గాయం!!