
కాన్బెర్రా: ఆస్ట్రేలియాపై తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా.. ఆఖరి వన్డేలో విజయం సాధించి జోరుమీదుంది. ఇదే ఊపులో టీ20 సిరీస్లో బోణీ కొట్టాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో యువకుల రాకతో టీమిండియా జట్టులో తాజాదనం కనిపించింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కాన్బెర్రా వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారికి ముందు కివీస్తో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 5-0తో క్లీన్స్వీప్ చేసింది. అదే ఆత్మవిశ్వాసంతో ఆసీస్తో పొట్టి క్రికెట్ సిరీసులో తలపడుతోంది.
టీ20 సిరీస్లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రికార్డులపై కన్నేశారు. 2019-20లో ధావన్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. కానీ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుతంగా రాణించి టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. 61 టీ20ల్లో 1588 రన్స్ చేసిన ధావన్.. మరో 29 రన్స్ చేస్తే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని దాటేస్తాడు. ధోనీ 98 టీ20ల్లో 1617 పరుగులు చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ మరో 18 పరుగులు చేస్తే.. రైనాను కూడా వెనక్కి నెడతాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. 29 రన్స్ చేస్తే మూడో స్థానంకు చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ (2794), రోహిత్ శర్మ (2773) ముందున్నారు. 42 మ్యాచ్ల్లో 1461 రన్స్ చేసిన కేఎల్ రాహుల్.. 39 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 1500కిపైగా రన్స్ చేసిన ఆరో భారత క్రికెటర్గా నిలుస్తాడు.
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా (59) తొలి స్థానంలో ఉన్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ 55 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీ20ల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉండటంతో.. అతణ్ని చహల్ వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
టీ20ల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు మెరుగైన రికార్డే ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11-8 తేడాతో భారత్దే పైచేయి. విజయాల శాతం 57.89. అయితే ఈ సిరీసుకు ముందు జరిగిన రెండు సిరీసుల్లోనూ కోహ్లీసేనకు మంచి ఫలితాలు రాలేదు. 2019 ఫిబ్రవరిలో ఉపఖండంలో ఆసీస్ పర్యటించింది. రెండు మ్యాచులు ఆడితే రెండూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. దానికి ముందు ఆసీస్లో పర్యటించిన టీమిండియా 3 టీ20ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది.