
ఓపెనర్గా రాహుల్:
టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ లేకపోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనర్గా రానున్నాడు. శిఖర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన రాహుల్.. ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. 14 మ్యాచుల్లో 670 పరుగులు చేశాడు. ఓ సెంచరీ (132), ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ ఫామ్నే టీ20 మ్యాచుల్లోనూ కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ధావన్ కూడా ఐపీఎల్, వన్డేలలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి ఇద్దరి నుంచి మంచి ఆరంభం ఆశించొచ్చు.

పాండ్యా, జడేజా కీలకం:
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. అతడు ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ సైతం నాలుగో స్థానంలో రాణిస్తే తిరుగుండదు. ఐదవ స్థానంలో మనీశ్ పాండే, సంజు శాంసన్లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. హైదరాబాద్ తరఫున మనీశ్.. రాజస్థాన్ జట్టుకు శాంసన్ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటు, బంతితో కీలకంగా మారనున్నారు. ఇద్దరూ ఐపీఎల్ 2020 నుంచి అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.

నట్టూ అరంగేట్రం?:
జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలతో పాటు వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, టీ నటరాజన్ రాకతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. ఆఖరి వన్డేలో యార్కర్లతో సత్తా చాటిన నటరాజన్.. టీ20ల్లో అరంగేట్రం చేయడమే ఖాయమే అనిపిస్తోంది. ఇక ఐపీఎల్లో పవర్ప్లే, మధ్య ఓవర్లలో సుందర్ను విరాట్ కోహ్లీ వ్యూహాత్మకంగా వాడుకున్నాడు. బ్యాటింగ్తోనూ అతడు జట్టుకు ఉపయోగపడ్డాడు. కాబట్టి యుజ్వేంద్ర చహల్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాతో కలిసి షమీ, దీపక్లో ఎవరు కొత్త బంతిని పంచుకుంటారో చూడాలి.

వార్నర్ లేకపోవడం లోటే:
స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద లోటే. ఫామ్లో ఉన్న ఆరోన్ ఫించ్తో మార్నస్ లబుషేన్ ఓపెనింగ్ చేయొచ్చు. బిగ్బాష్లో ఓపెనర్గా మెరుపులు మెరిపించిన స్టాయినిస్ సైతం అందుబాటులోనే ఉన్నాడు. అయితే అతడికి చిన్న గాయం కావడంతో ఆడటం అనుమానమే. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కేరీ, డీఆర్సీ షార్ట్ భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆఖరి వన్డేలో విశ్రాంతి తీసుకున్న మిచెల్ స్టార్క్ రావడంతో ఆసీస్ బౌలింగ్ మరింత పటిష్టం కానుంది.

టీమిండియాకు మెరుగైన రికార్డే:
టీ20ల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు మెరుగైన రికార్డే ఉంది. ఈరెండు జట్లు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 11-8 తేడాతో భారత్దే పైచేయి. విజయాల శాతం 57.89. అయితే ఈ సిరీసుకు ముందు జరిగిన రెండు సిరీసుల్లోనూ కోహ్లీసేనకు మంచి ఫలితాలు రాలేదు. 2019 ఫిబ్రవరిలో ఉపఖండంలో ఆసీస్ పర్యటించింది. రెండు మ్యాచులు ఆడితే రెండూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. దానికి ముందు ఆసీస్లో పర్యటించిన టీమ్ఇండియా 3 టీ20ల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది.

తుది జట్లు (అంచనా)
భారత్: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే/సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్/మహమ్మద్ షమీ, టీ నటరాజన్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, డీఆర్సీ షార్ట్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్/మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కేరీ, ఆస్టన్ ఏగర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్/డేనియెల్ సామ్స్, జోష్ హేజిల్వుడ్, ఆడమ్ జంపా.


Click it and Unblock the Notifications

'శుబ్మన్ గిల్ క్రికెటర్ కాకపోయుంటే.. రైతు అయ్యేవాడు'










