హైదరాబాద్: చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 83 పరుగులు చేసిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.
ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో హ్యాట్రిక్స్ సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం అడ్డంకిగా మారడంతో ఆసీస్ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్ధారించారు. అయితే ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దీంతో తొలి వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే సమయంలో హార్దిక్ పాండ్యా వేసుకున్న గ్లౌవ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా ఆ ప్రాంఛైజీ అందజేసిన గ్లౌవ్స్ని వేసుకుని తొలి వన్డేలో బ్యాటింగ్ చేశాడు.
దీనిపై బీసీసీఐ, భారత జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోయినా.. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం పాండ్యా తీరుపై విమర్శలు చేస్తున్నారు. 'హార్దిక్ ఇప్పుడు నువ్వేమైనా.. ఐపీఎల్కి ఆడుతున్నావా?' అని నెటిజన్ కామెంట్ చేయగా 'భారత్ జట్టుకి ఆడుతూ ముంబై ఇండియన్స్ గ్లౌవ్స్ ఎందుకు ధరించావు? ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?' అని మరొకరు ట్వీట్ చేశారు.
'కుంఫూ పాండ్యా టీమిండియాకి ఆడుతూ.. కరీబియన్ హెయిర్ స్టైల్తో.. ముంబై ఇండియన్స్ గ్లౌవ్స్ వేసుకుని ఆడుతున్నాడే.. నాకు తికమకగా ఉంది' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.