హైదరాబాద్: పసికూనల పంతానికి అపార అనుభవం సమాధానం చెప్పేందుకు బెంగళూరు వేదికైంది. ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న అఫ్ఘానిస్థాన్ భారత్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతోంది. ఐపీఎల్ అనంతరం భారత్ ఆడుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ అవుతుండటంతో అభిమానుల మధ్య భారీ ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్లో విదేశీ క్రికెటర్లపై అద్భుతంగా రాణించిన అఫ్ఘాన్ బౌలర్లు తమ సత్తాను మరో సారి నిరూపించుకునేందుకు సిద్ధమైయ్యారు.
ఈ నేపథ్యంలో.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రషీద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడిన ముజీబ్ రెహమాన్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగి టీమిండియాను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ జరుగుతుండగా.. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకు ఓ కొత్త తరహా డెలివరీని నేర్పించాడని 17 ఏళ్ల అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వెల్లడించాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున అశ్విన్, ముజీబ్ ఆడిన విషయం తెలిసిందే. నెట్స్లో అశ్విన్ తనకు చాలా బౌలింగ్ మెలకువల్ని నేర్పించాడని.. బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో వాటిని ఆచరణలో పెడతానని ముజీబ్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో మొత్తం 11 మ్యాచ్లాడిన ముజీబ్ 14 వికెట్లు పడగొట్టాడు.
'నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నానని ఐపీఎల్ సమయంలో అశ్విన్ నాతో అన్నాడు. ఏ ప్రదేశంలో బంతులు విసిరితే వికెట్లు పడతాయి.. పరుగులు కట్టడి చేయచ్చో కూడా చెప్పాడు. ఆ సమయంలోనే ఓ కొత్త డెలివరీని అతను నాకు నేర్పించాడు. ఆ తర్వాత ఐపీఎల్ ముగిసినా కూడా ఆ బంతిని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ డెలివరీని వేసే సమయంలో.. వేళ్లపై భారం ఎక్కువగా పడుతుందని అప్పట్లో అశ్విన్ నాకు చెప్పాడు. ఇప్పుడు ఫర్వాలేదు.. ఆ బంతిని విసరడంపై ఇప్పుడు పట్టు సాధించాను. అశ్విన్ నాకు ఓ మెంటార్లాంటి వాడు' అని ముజీబ్ వెల్లడించాడు.