స్వదేశంలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. మొహాలి వేదికగా రేపు రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మరోవైపు జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం.
అయితే రోహిత్ శర్మకు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్లో ఆది నుంచే ప్రతిదాడికి దిగుతూ ప్రత్యర్థులపై పైచేయి సాధించిన హిట్మ్యాన్ అఫ్గాన్ సిరీస్లో పలు రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు 51 మ్యాచ్లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రోహిత్ శర్మ 39 మ్యాచ్ల్లో నెగ్గాడు. అయితే అత్యధిక టీ20 విజయాలు సాధించిన కెప్టెన్గా నిలవడానికి రోహిత్ మరో మూడు విజయాలు అవసరం.

ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సహా అయిదుగురు పేరిట ఉంది. ధోనీ, అస్గర్ (అఫ్గానిస్థాన్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బ్రెయిన్ మసబా (ఉగాండ) సారథ్యంలో తమ జట్లు 42 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అయితే అఫ్గానిస్థాన్ సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేస్తే టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ రికార్డులకెక్కుతాడు.
అంతేగాక రోహిత్ మరో 44 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత్ కెప్టెన్గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు రోహిత్ మరో రికార్డుకు 147 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ రన్స్ను సాధిస్తే నాలుగు వేల పరుగుల మార్క్ను అందుకున్న రెండో భారత బ్యాటర్గా రోహిత్ రికార్డు నెలకొలుపుతాడు. విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్ టీ20ల్లో 100 సిక్సర్ల రికార్డుకు 18 సిక్సర్లు దూరంలో ఉన్నాడు.