మొహాలి వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ఆల్రౌండ్ షోతో విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబె (1/9; 60; 40 బంతుల్లో) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్పై అఫ్గాన్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
అఫ్గానిస్థాన్ ఓపెనర్లు గుర్బాజ్ (23; 28 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (25; 22 బంతుల్లో) అర్ధశతకం భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ భారత్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీయడంతో 10 ఓవర్లలోపే 57/3తో కష్టాల్లో నిలిచింది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన నబీ (42; 27 బంతుల్లో).. అజ్మతుల్లా (29; 22 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నబీ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగాడు. భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/33), అక్షర్ పటేల్ (2/23), దూబె (1/9) సత్తాచాటారు. రవి బిష్ణోయ్ (0/35) దారుణంగా విఫలమయ్యాడు.

అనంతరం ఛేదనకు వచ్చిన భారత్ 17.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. రోహిత్ శర్మ (0) ఆదిలోనే డకౌటయ్యాడు. తిలక్ వర్మ (26; 22 బంతుల్లో)తో కలిసి గిల్ (23; 12 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ముజీబ్ బౌలింగ్లో గిల్ స్టంపౌటయ్యాడు. కాసేపటికీ తిలక్ వర్మ కూడా పెవిలియన్కు చేరాడు.. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన జితేశ్ (31; 20 బంతుల్లో) కలిసి దూబె ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జితేశ్ ఔటైనా రింకూ సింగ్ (16; 9 బంతుల్లో)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అయితే రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 100 విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున రోహిత్ ఇప్పటివరకు 149 మ్యాచ్లు ఆడగా 100 సార్లు గెలుపు రుచి చూశాడు. హిట్ మ్యాన్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (124 మ్యాచ్ల్లో 86 విజయాలు), విరాట్ కోహ్లి (115 మ్యాచ్ల్లో 73 విజయాలు), మహ్మద్ హఫీజ్ (119 మ్యాచ్ల్లో 71 విజయాలు), మహ్మద్ నబీ (112 మ్యాచ్ల్లో 70 విజయాలు) ఉన్నారు.