హైదరాబాద్: మరో రెండు రోజుల్లో జరగనున్న చారిత్రాత్మక టెస్టుకు బెంగళూరు వేదికకానుంది. ఈ సమయంలో అఫ్గానిస్థాన్తో పోటీపడేందుకు టీమిండియా ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా.. ఆ జట్టు స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ను ఎదుర్కోవడంపై టీమిండియా ఎక్కువగా కసరత్తులు చేస్తోంది. . మణికట్టు స్పిన్నర్లు చాహల్, కౌశిక్లను పిలిపించి మరీ భారత బ్యాట్స్మెన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్తో టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్ల జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఉన్నా.. చాహల్ని పిలవడం వెనుక కారణం రషీద్ని ఎదుర్కోవడంపై అవగాహన తెచ్చుకోవడానికేననే తెలుస్తోంది. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్ జట్టుకి ఇదే తొలి టెస్టుకాగా.. ఏడాదికాలంగా రషీద్ ఖాన్ ఒంటిచేత్తో జట్టుకి విజయాల్ని అందిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ఈ 19 ఏళ్ల బౌలర్.. బంగ్లాదేశ్తో గత వారం ముగిసిన మూడు టీ20ల సిరీస్లో 12 వికెట్లు పడగొట్టి అఫ్గానిస్థాన్ 3-0తో సిరీస్ కైవసం చేసుకోవడం కీలకంగా వ్యహరించాడు.
భారత పిచ్లపై మంచి పట్టు సాధించిన ఈ స్పిన్నర్ని ఎదుర్కోవడం టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి టెస్టు మ్యాచ్లో సవాల్ అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్లు మంచి ప్రదర్శన చేసినట్లైతే ఇండియన్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ముజీబ్, రషీద్ ఖాన్ లు భారత గడ్డపై, భారత ఆటగాళ్లను ఎదుర్కొన్న అనుభవమున్న వారే.
ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సిరీస్కు వాతావరణ పరిస్థితులను బట్టి మ్యాచ్ స్థితిగతులు మారే సూచనలున్నాయి. ప్రాక్టీసుకు చాహల్ను తీసుకురావడంపై తుది జట్టులో స్థానం పట్ల రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఎవరిని తీసుకుంటారననే సందేహం నెలకొంది. మరో వైపు కుల్దీప్ యాదవ్ అతని కెరీర్లోనే మూడు టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైయ్యాడు.