
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. సఫారీ గడ్డపై తన అద్భుత ఆటతీరుతో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో ఇండియా ఫ్యాబ్ ఫోర్ (భారత బ్యాటింగ్ చతుష్టయం) సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన కోహ్లీ నిలుస్తాడని గంగూలీ అన్నాడు. ప్రతి ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ శక్తి సామర్థ్యాలు, అతడు ఆడుతున్న తీరు నిజంగా అద్భుతమని దాదా కొనియాడాడు.
'సఫారీ గడ్డపై భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. మూడు టెస్టుల సిరిస్ను 1-2తో చేజార్చుకున్నా... ఆరు వన్డేల సిరిస్లో 3-0తో కోహ్లీసేన పుంజుకున్న తీరు అద్భుతం. అదృష్టం కొద్దీ సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, వీరూ లాంటి ఆటగాళ్లతో కలిసి ఆడాను. రికీ పాంటింగ్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లకు ప్రత్యర్థిగా క్రికెట్ ఆడాను' అని దాదా అన్నాడు.
'విరాట్ కోహ్లీ వీరందరి స్థాయికి తగిన ఆటగాడు. వీరి సరసన నిలుస్తాడు. పరిస్థితులకు అనుగుణం తనను తాను మలుచుకోవడం, నియంత్రణ కలిగి ఉండటంతోపాటు ప్రతి ఇన్నింగ్స్ తన బ్యాటింగ్లో అతడి ఎనర్జీ నిజంగా గ్రేట్' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
'ప్రపంచంలో మరే క్రికెట్ సాధించని విధంగా అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో విరాట్ కోహ్లీ 34వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో మరే భారత ఆటగాడు సెంచరీ సాధించలేదు. కానీ కోహ్లీ రెండు అద్భుత శతకాలు నమోదు చేశాడు. దీన్ని బట్టే అతడెంతటి బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు' అని గంగూలీ చెప్పాడు.
మరోవైపు ఇప్పటివరకు జరిగిన మూడు వన్డేల్లో 21 వికెట్లు తీసిన మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లపై కూడా గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఈ సిరిస్లో ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులో చేరడం ఊరట కలిగించేదే. ఏబీ రాకతో సఫారీ జట్టు సెలక్షన్ సమస్యలను ఎదుర్కొంటుంది' అని దాదా అన్నాడు.