
హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా వంద వికెట్లు సాధించిన మూడో భారత్ పేసర్గా గుర్తింపు సాధించాడు. సెంచూరియన్ టెస్టులో రెండో రోజు ప్రారంభంలోనే కేశవ్ మహారాజ్ను పెవిలియన్ చేర్చడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కేశవ్ మహరాజ్ను ఔట్ చేయడం ద్వారా షమీ తన ఖాతాలో వందో వికెట్ను వేసుకున్నాడు. ప్రస్తుతం తన కెరీర్లో 29వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న షమీ ఈ జాబితాలో మూడో స్ధానంలో నిలిచాడు. షమీకి ముందు కపిల్ దేవ్(25 టెస్టులు), ఇర్ఫాన్ పఠాన్(28 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఆ తర్వాతి స్ధానంలో జవగళ్ శ్రీనాథ్(30 టెస్టులు) నాలుగో స్థానంలో ఉండగా, ప్రస్తుతం భారత పేసర్లలో ఒకడైన ఇషాంత్ శర్మ (33 టెస్టులు) ఐదో స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున మొత్తంగా ఏడుగురు పేసర్లు మాత్రమే టెస్టుల్లో వంద వికెట్లను తీసుకున్నారు. కర్షన్ ఘావ్రి (36 టెస్టులు), జహీర్ ఖాన్ (37 టెస్టులు) ఈ ఘనత సాధించిన ఇతర భారత పేసర్లు.
సెంచూరియన్ వేదికగా భారత్తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు 335 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 269/6తో రెండో రోజైన ఆదివారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా ఆదిలోనే కేశవ్ మహారాజ్ వికెట్ కోల్పోయింది.
18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్లో కీపర్ పార్థీవ్ పటేల్కు క్యాచ్ ఇచ్చిన మహారాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా 287 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆదివారం భారత ఫీల్డర్ల ఫీల్డింగ్ తప్పిదాలు దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది.
అశ్విన్ బౌలింగ్లో వరుసగా రెండు బంతుల్లో ఫీల్డర్లు క్యాచ్ జారవిడవడంతో రబడకు లైఫ్ వచ్చింది. తర్వాత కూడా అతడికి మరోసారి లైఫ్ వచ్చింది. దీంతో రబడ 34 బంతులను ఎదుర్కొని 11 పరుగులు చేయగా.. మరో ఎండ్లో కెప్టెన్ డుప్లెసిస్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును 300 పరుగులు దాటించాడు.
డుప్లెసిస్ 63 పరుగులతో రాణించడంతో.. దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగలిగింది. రబడ, డుప్లెసిస్లను వరుస ఓవర్లలో ఇషాంత్ అవుట్ చేయడంతో సఫారీల తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.