హైదరాబాద్: ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సమరంలో తొలి రోజు తొలి టెస్టులో ఓ వింత చోటు చేసుకుంది. సాఫీగా సాగుతున్న మ్యాచ్లోకి ఓ పావురం వచ్చి ఆటంకం కలిగించింది. అప్పటికీ క్రీజులో జెన్నింగ్స్, జో రూట్ ఇద్దరూ ఉన్నారు. రెండో సెషన్లో 36వ ఓవర్ వేయడానికి షమి సిద్ధం కాగా.. ఒక పావురం వచ్చి పిచ్కు దగ్గర్లో వాలింది. అది అక్కడే తిరుగుతుండటంతో దాన్ని తరిమేందుకు బ్యాట్స్మెన్ రూట్, జెన్నింగ్స్ ఇద్దరూ ప్రయత్నించారు. కానీ అది కదల్లేదు. దీని వల్ల కొన్ని నిమిషాల పాటు ఆట ఆగింది. కాసేపటి తర్వాత అది అక్కడి నుంచి తుర్రుమనడంతో ఆటను కొనసాగించారు.
ఆ తర్వాతి బంతిని వేయగానే జెన్నింగ్స్ వికెట్ సమర్పించుకుని వెనుదిరిగాడు. ఇంగ్లాండ్-ఇండియా తొలి టెస్టు పోరులో భారత్యే పైచేయి సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో తొలిరోజు భారత్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. స్పిన్నర్ అశ్విన్ (4/60) ఆతిథ్య జట్టును గట్టి దెబ్బే తీశాడు. షమి (2/64) కూడా సత్తా చాటాడు.
He's not the first English batsman to be undone by a Pigeon! pic.twitter.com/etJXh6v3NM
— FOX SPORTS Australia (@FOXSportsAUS) August 2, 2018
షమీ జెన్నింగ్స్ వికెట్ తీసిన కాసేపటికే రవిచంద్రన్ అశ్విన్ సెంచరీకి దగ్గర్లో ఉన్న జో రూట్(80) వికెట్ ను తీశాడు. కోహ్లీ రనౌట్ చేయడంతో రూట్ పెవిలియన్ చేరాడు. దీంతో.. కోహ్లీ అమిత్సాహంతో సంబరాలు జరుపుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి నుంచి ఆచితూచి ఆడింది. వికెట్లను కాపాడుకుంటూ భారత బౌలర్లకు సవాలు విసిరింది. ఈ క్రమంలో భారత బౌలర్లు పటిష్టమైన బౌలింగ్ చేయడంతో .. వికెట్లను చక్కగా రాబట్టగలిగారు.
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. శిఖర్ ధావన్-మురళీ విజయ్ భారత ఇన్నింగ్స్ను ఆరంభించారు. విజయ్ నెమ్మదిగా ఆడుతుండగా మరో ఓపెనర్ ధావన్ కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. 8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ 12, ధావన్ 15 పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులు చేసింది.