క్రికెటర్ కాకముందు చాహల్ చెస్ ఆటగాడు
క్రికెటర్ కాకముందు చాహల్ జాతీయ స్థాయి చెస్ ఆటగాడు. జూనియర్ స్థాయిలో అండర్ 16 భారత జట్టుకు చాహల్ ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారి 2009లో జరిగిన నేషనల్ అండర్ 19 బెహర్ ట్రోపీలో 34 వికెట్లు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనే చాహల్కు 2011లో హర్యానా రంజీ జట్టులో చోటు సంపాదించేలా చేసింది.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున
ఆ తర్వాత అదే ఏడాది ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ఆడాడు. బెంగళూరుతో ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన చాహల్.. ముంబైకి ట్రోఫీ దక్కడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో బెంగళూరు ప్రాంఛైజీ చాహల్ను 2014 వేలంలో కనీస ధర (రూ.10 లక్షలు)కు దక్కించుకుంది.
2016 జూన్లో జింబాబ్వే తొలిసారి టీమిండియాకు ఎంపిక
2014లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున యజ్వేంద్ర చాహల్ ఆకట్టుకున్నాడు. 2016 జూన్లో జింబాబ్వే పర్యటనలో తొలిసారి భారత్కు ఎంపికైన చాహల్ తొలి వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు.
మూడో టీ20లో ఇంగ్లాండ్ను తిప్పేసిన చాహాల్
సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20లో భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ను తిప్పేశాడు. అనూహ్యరీతిలో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు టీ20ల సిరిస్ను 2-1తో భారత్ సొంతం
దీంతో మూడు టీ20ల సిరిస్ను 2-1తో భారత్ సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్పై టీమిండియాకిది హ్యాట్రిక్ సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆ తర్వాత 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.
చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్
చాహల్ స్పిన్ మాయాజాలన్ని ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్మన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఐదుగురు ఆటగాళ్లు డకౌట్గా వెనుదిరగడం విశేషం. బిల్లింగ్స్, జోస్ బట్లర్, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్కు చేరారు. తొలిసారి 6 వికెట్లు తీసుకున్న చాహల్ తన కెరీర్లో తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు.