హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియతో జరుగుతున్న మూడో టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అద్భుతం చేశాడు. స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ వేసిన 'బాల్ ఆఫ్ ద సెంచరీ' అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి బంతినే రాంచీ టెస్టులో జడేజా వేశాడు.
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను జడేజా అవుట్ చేసిన బంతి ఓ అద్భుతమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐదో రోజు తొలి సెషన్లో ఈ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో జడేజా బౌలింగ్ చేశాడు. లెగ్ స్టంప్ బయట పడిన బాల్ అనూహ్యంగా తిరిగి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది.
బంతి స్టంప్స్ను తగలదని దానిని ఆడకుండా వదిలేసిన స్మిత్ దానిని చూసి షాకయ్యాడు. నిజానికి జడేజా వేసే బంతులు పెద్దగా స్పిన్ తిరగవు. ఎందుకంటే జడేజా స్పిన్ కంటే వేగంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తాడు కాబట్టి. జడేజా వేసిన బంతిని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అలాగే భావించినట్లు ఉన్నాడు.
దీంతో లెగ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్, ప్యాడ్తో అడ్డుకోకుండా అలా వదిలేశాడు. ఇంకేముంది బంతి అమాంతం ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో స్మిత్ ఆశ్చర్యపోయాడు. నిజానికి రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రెండు రోజులు భారత్ విజయంపై పెద్దగా ఆశలు లేవు.
అయితే నాలుగో రోజు ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఈ సిరిస్లో అద్భుతంగా రాణిస్తున్న స్టీవ్ స్మిత్ చివరిరోజు భారత్ విజయానికి అడ్డుపడతాడని క్రికెట్ విశ్లేషకులు భావించారు. అలాంటి స్మిత్ను జడేజా తన అద్భుతమైన బౌలింగ్తో పెవిలియన్కు చేర్చాడు.