హైదరాబాద్: తాను క్రికెటర్గా, ఓ వ్యక్తిగా ఎదగడానికి టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఎంతగానో సాయపడుతున్నాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తొలి టెస్టు నేపథ్యంలో పూణెలో బుధవారం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. జట్టుగా టీమిండియా ప్రస్తుతం అత్యుత్తమంగా రాణించడంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు.
తన తప్పులు తెలుసుకొని, ఓ వ్యక్తిగా ఎదగడానికి తాను ప్రయత్నిస్తున్నానని, ఈ విషయంలో కుంబ్లే తనకు తోడ్పాటునందిస్తున్నాడని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు. అనిల్ కుంబ్లే తాను ఆడిన రోజుల్లో దూకుడుగా ఉండేవాడని, అయితే ఎప్పుడు దూకుడు ప్రదర్శించాలో ఎప్పుడు వెనక్కి తగ్గాలో అతనికి బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.
కుంబ్లే అనుభవంతో తాను కూడా పాఠాలు నేర్చుకుంటున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక వికెట్లు తీసే విషయంలో భారత బౌలర్లో కుంబ్లే దూకుడు పెంచాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కుంబ్లే స్ఫిన్నర్ అయినా మ్యాచ్లో మాత్రం ఫాస్ట్ బౌలర్గా ఆలోచిస్తాడని కోహ్లీ అన్నాడు.

అందుకే కుంబ్లే టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ విన్నర్గా తనకున్న అనుభవంతో బౌలర్ల మైండ్సెట్ను మారుస్తున్నాడని, బౌలర్లు అతని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
ఇక నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదలయ్యే ముందు కేవలం ఆటపైనే దృష్టి పెడతామని, ప్రత్యర్ధి ఎవరనే విషయం గురించి ఆలోచించమని కోహ్లీ అన్నాడు. ప్రతి సిరీస్ తమకు ఛాలెంజింగ్గానే ఉంటుందని కోహ్లీ చెప్పాడు.
ఆసీస్తో సిరీస్కు ముందు కొన్ని టెస్టు సిరీస్లు గెలవడంతో ప్రస్తుతం తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని చెప్పిన కోహ్లీ, మ్యాచ్లో గెలవడానికి ఎవరి ప్రణాళికలు వాళ్ల వద్ద సిద్ధంగా ఉంటాయని కోహ్లీ అన్నాడు. ఇక, భారత్, ఆస్ట్రేలియాల మధ్య పూణె వేదికగా గురువారం తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన కీలక ఆటగాళ్లు బుధవారం నెట్ ప్రాక్టీస్ చేశారు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు ఎక్కువ కసరత్తు చేశారు. గతంలో కొన్ని మ్యాచ్ల్లో ఫీల్డింగ్ తప్పిదాల వల్ల కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు.