
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే విశ్వాసం వ్యక్తంచేశాడు. ఆదివారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుంబ్లే మీడియాతో మాట్లాడాడు.
గతంలో ఏ జట్టూ సాధించలేని ఘనతను కోహ్లీసేన సాధిస్తుందని కుంబ్లే తేల్చి చెప్పాడు. 'భారత జట్టుపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. గత జట్లు చేయలేని పనిని కోహ్లీ బృందం సాధించి చరిత్ర సృష్టిస్తుంది. ఈ జట్టుపై నాకు అంతగా నమ్మకం ఉంది' అని కుంబ్లే అన్నాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాలున్నప్పటికీ అనిల్ కుంబ్లే అతడిపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జనవరి 5న ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం కోహ్లీసేన ఇప్పటికే స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఫాస్ట్ పిచ్లపై ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్ కోహ్లీసేనకు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది.
ఈ సిరిస్ గనుక గెలిస్తే అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా పది టెస్టు సిరిస్లను గెలిచి జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.