భారీ ధర పలకడం ఖాయం
అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలంలో 10 ప్రాంచైజీలకు హాట్ కేకుల్లా మారారనడంతో ఎలాంటి సందేహం లేదు. సీనియర్లకు భారీగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసి వారు ఆడుతారో లేదో అనే టెన్షన్ పడే కంటే 19 ఏళ్ల కుర్రాళ్లైనా ఇండియా అండర్ 19 ఆటగాళ్లను కొనుగోలు చేయడమే బెటర్ అని ఫ్రాంచైజీలన్నీ భావిస్తున్నాయట. దీంతో టీమిండియా అండర్ 19 ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన కుర్రాళ్లు వేలంలో భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారిపైనే కన్ను
ముఖ్యంగా టీమిండియా అండర్ 19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యష్ ధూల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, పేస్ ఆల్రౌండర్ రాజ్ బవా, పేసర్ రవి కుమార్పై ఫ్రాంచైజీలన్నీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నలుగురిని వేలంలో ఎంత ధర అయినా సరే పెట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయట. కాగా టీమిండియా అండర్ 19 ప్రపంచకప్ గెలవడంతో వీరు నలుగురు కీలక పాత్ర పోషించారు. దాదాపు ప్రతి మ్యాచ్లో సత్తా చాటారు. సెమీఫైనల్లో అయితే యష్ ధూల్, షేక్ రషీద్ అద్భుతంగా ఆడి ఏకంగా డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫైనల్లోనూ రషీద్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఆడిన ప్రతి మ్యాచ్లో మంచి స్కోర్లు నమెదు చేశారు.
రాజ్ బవాపైనే అందరి చూపు
టీ20 ఫార్మాట్లో ఆల్రౌండర్ల పాత్ర కీలకం. అటువంటి ఆల్రౌండర్ పాత్ర అండర్ 19 వరల్డ్కప్లో రాజ్ బవా అద్బుతంగా నిర్వర్తించాడు. అటు తన పేస్ బౌలింగ్తో కీలక వికెట్లు తీస్తూనే, బ్యాట్తోనూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి, అవసరమైన పరుగులు చేశాడు. దీంతో మెగా వేలంలో అందరి చూపు ఈ యువ పేస్ ఆల్రౌండర్పై పడిందని తెలుస్తోంది. దీంతో వేలంలో ఈ యువ ఆల్రౌండర్ భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వరల్డ్కప్లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీసిన యువ పేసర్ రవి కుమార్ కూడా వేలంలో భారీ ధర పలకడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
వారిపై కూడా కన్ను
వీరే కాకుండా వరల్కప్లో స్థిరంగా రాణించిన బౌలర్లు కౌశల్ థాంబే, విక్కీ ఓస్త్వాల్ వేలంలో హాట్ కేకుల్లా మారారు. అలాగే ఓపెనర్లు రఘువంశీ, హర్నూర్ సింగ్పై కూడా పలు ఫ్రాంచైజీలు కన్నేశాయని సమాచారం. వీరే కాకుండా వికెట్ కీపర్ రాజ్ బనా, నిశాంత్ సింగ్ కూడా వేలంలో మంచి ధరకు అమ్ముడు పోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ధర ఎంతంటే?
ఐపీఎల్ మెగా వేలంలో ఇండియా అండర్ 19 ఆటగాళ్లు యష్ ధూల్, రవి కుమార్, షేక్ రషీద్, రాజ్ బవా 6 నుంచి 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతారని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కౌశల్ థాంబే, విక్కీ ఓస్త్వాల్, రఘువంశీ, హర్నూర్ సింగ్, రాజ్ బనా, నిశాంత్ సింగ్ కూడా 5 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.