మొహాలి: న్యూజిలాండ్తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో భాగంగా చివరి రెండు వన్డేలకు బీసీసీఐ భారత జట్టును సోమవారం ప్రకటించింది. న్యూజిలాండ్తో జరగనున్న మిగతా రెండు వన్డేలకు అదే జట్టును కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలియజేసింది.
బీసీసీఐ తాజా ప్రకటనతో న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరిస్ నుంచి సురేశ్ రైనా ఔటయ్యాడు. వైరల్ ఫీవర్ కారణంగా తుది జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా మిగతా రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు.

మిగతా రెండు వన్డేలకు కూడా జట్టులో ఎటువంటి మార్పులు చేయకపోవడంతో రైనాకు నిరాశ తప్పలేదు. పేటీఎం వన్డే సిరిస్లో మూడో వన్డేలో ఆడిన జట్టుతోనే చివరి రెండు వన్డేలు టీమిండియా ఆడనున్నట్లు టీమిండియా సెలక్షన్ కమిటీ చెప్పడంతో ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రకటన వెలువడింది. దీంతో చివరి రెండు వన్డేలకు భారత జట్టులో మార్పులు చోటు చేసుకోవడంలేదు.
వైరల్ ఫీవర్ నుంచి సురేశ్ రైనా కోలుకున్నప్పటికీ, ఫిట్నెస్గా లేడని బీసీసీఐ పేర్కొంది. అతని స్ధానంలో జట్టులోకి ఎవరినీ తీసుకోవడం లేదని, 14 మంది జట్టు సభ్యులతోనే టీమిండియా బరిలోకి దిగుతుందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. ఆదివారం మొహాలి జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో ఐదు వన్డేల సిరిస్లో టీమిండియా 2-1తేడాతో ముందంజలో ఉంది. నాలుగో వన్డే 26న రాంచిలో జరగనుండగా, సిరిస్లో చివరిదైన ఆఖరి వన్డే 29న విశాఖపట్నంలో జరగనుంది.
చివరి రెండు వన్డేలకు భారత జట్టు:
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, అక్షర పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, జస్ప్రీత్ బుమ్రా, ధావల్ కులకర్ణి, ఉమేష్ యాదవ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్.