భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. మంగళవారం నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. పది వికెట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసింది. బౌలర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ భారత బౌలర్ల ధాటికి 22.1 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. మన బౌలర్లు చెలరేగడంతో నేపాల్ జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. అత్యధిక స్కోరు ఏడు మాత్రమే. ఇద్దరూ డకౌటయ్యారు.

ఇన్నింగ్స్ అయిదో ఓవర్ లో రాజ్ లింబాని ప్రత్యర్థి వికెట్ల వేటను మొదలుపెట్టాడు. అతడి ధాటికి నేపాల్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబాని ఏడు వికెట్లు తీయగా, ఆరాద్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక్క వికెట్ పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలోనే ఛేదించింది. అర్షిన్ కులకర్ణి 30 బంతుల్లో 43 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 13 బంతుల్లో 13 పరుగులు తీశాడు. కాగా, ఆసియా కప్ లో మూడు మ్యాచ్ లు ఆడిన భారత్ రెండు విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. అఫ్గానిస్థాన్, నేపాల్ పై గెలిచిన టీమిండియా పాకిస్థాన్ మ్యాచ్ లో తడబడింది.
పాక్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 47 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.