అండర్ 19 ఆసియా కప్- 2024లో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ 13 ఏళ్ల బిహార్ కుర్రాడు తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక్క పరుగుకే పెవిలియన్కు చేరాడు. అలీ రజా బౌలింగ్లో వికెట్ కీపర్ సాద్ బేగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్లోనే సెన్సేషన్గా మారిన ఈ కుర్రాడి కోసం మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా రాజస్థాన్ రూ. కోటీ 10 లక్షలు వెచ్చించి వైభవ్ను సొంతం చేసుకుంది. 13 ఏళ్ల 243 రోజు వయసు ఉన్న వైభవ్ను రాజస్థాన్ తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ భారీ అంచనాల మధ్య ఆసియా కప్లో బరిలోకి దిగాడు. కానీ పాక్ మ్యాచ్లో సత్తాచాటలేకపోయాడు.

కాగా, శనివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్కు పాకిస్థాన్ 282 పరుగుల సవాలైన లక్ష్యం నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలలో ఏడు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ భారీ శతకం సాధించాడు. 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. యూత్ వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన పాకిస్థాన్ బ్యాటర్గా, యూత్ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గానూ షాజైబ్ ఖాన్ రికార్డులు నెలకొల్పాడు.
మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (60; 94 బంతుల్లో, 6 ఫోర్లు) కూడా రాణించాడు. తొలి వికెట్కు పాకిస్థాన్ 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీమిండియా బౌలర్లలో సమర్థ్ నాగరాజు మూడు వికెట్లు, ఆయుష్ రెండు, యుధజిత్, కిరణ్ తలో వికెట్ తీశారు. కాగా, ఛేదనలో భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. 51 పరుగులకు ముగ్గురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్కు చేరారు.