అండర్ 19 ఆసియా కప్- 2024లో యువ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. ప్రారంభ మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇండియా.. జపాన్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో సత్తాచాటి 211 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. కెప్టెన్ మహ్మద్ అమాన్ అజేయ శతకంతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. 118 బంతుల్లో 122 పరుగులు చేశాడు. 7 బౌండరీలు సాధించాడు.
అమాన్తో పాటు కార్తికేయ (57; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), ఆయుష్ (54; 29 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఆరు వికెట్లకు 339 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన యువ భారత్కు శుభారంభం దక్కింది. సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (23; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్లు)తో కలిసి ఆయుష్ తొలి వికెట్కు 7.2 ఓవర్లలోనే 65 పరుగులు జోడించాడు.

అనంతరం స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు ఔటైనప్పటికీ సిద్ధార్థ్ (35; 48 బంతుల్లో, 2 ఫోర్లు), కార్తికేయతో కలిసి అమాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సిద్ధార్థ్తో అర్ధశతక, కార్తికేయతో శతక భాగస్వామ్యాల్ని నమోదు చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో సహచరులు వెనుదిరుగుతున్నా అమాన్ ఆఖరి వరకు క్రీజులో నిలిచి జపాన్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు. ఆఖర్లో హార్దిక్ రాజ్ (25 నాటౌట్; 12 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. జపాన్ బౌలర్లలో కీఫెర్ లేక్, హుగో కెల్లి చెరో రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో జపాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్కు జపాన్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హుగో కెల్లి (50; 111 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. చార్లెస్ హింజ్ (35 నాటౌట్; 68 బంతుల్లో, 2 ఫోర్లు) ఆలౌట్ కాకుండా జట్టును కాపాడాడు. ఛేతన్ శర్మ, హార్దిక్ రాజ్, కార్తికేయ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, గ్రూప్-ఏలో పాకిస్థాన్ (4 పాయింట్లు, +1.120) టాప్లో ఉంది. తర్వాతి స్థానాల్లో యూఏఈ (2 పాయింట్లు, +2.040), భారత్ (2 పాయింట్లు, +1.680), జపాన్ (-4.840) ఉన్నాయి.