చెన్నై వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి టెస్టులో యువ భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 1-0తో బోణీ కొట్టింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా, గొప్పగా పోరాడి లక్ష్యాన్ని ఛేదించింది. నిఖిల్ (55 నాటౌట్), నిత్య జే పాండ్య (51) అర్ధ శతకాలతో అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో ఎయిడెన్ ఓకానర్ నాలుగు, విశ్వ రామకుమార్ మూడు వికెట్లు తీశారు.
ఛేదన ఆరంభంలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ రికార్డు సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ సూర్యవంశీ 62 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెషనల్ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. సూర్యవంశీ వికెట్ పడిన కాసేపటికే మరో ఓపెనర్ విహాన్ (11) కూడా ఔటయ్యాడు.

ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన నిత్య, కార్తికేయ (35) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు మూడో వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని స్వల్పవ్యవధిలోనే మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత్ 113 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనంతరం జట్టు బాధ్యతలను నిఖిల్ అందుకున్నాడు.
వికెట్ కీపర్ అభిగ్యాన్ (23)తో 49 పరుగులు, సమర్థ్ నాగరాజు (19)తో 43 పరుగుల కీలక భాగస్వామ్యాల్ని నమోదు చేశాడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా, ఓవర్నైట్ స్కోరు 110/4తో ఇవాళ ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రిలే కింగ్సెల్ (48) టాప్ స్కోరర్. మహ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. సోహమ్ పట్వర్థన్ మూడు వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 293 పరుగులకు ఆలౌటైంది. ఎయిడన్ ఒకానర్ (61), రిలే కింగ్సెల్ (53) అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో మహ్మద్ ఇనాన్, సమర్థ్ నాగరాజు చెరో మూడు వికెట్లు, ఆదిత్య రావత్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ మొదటి ఇన్నింగ్స్లో 296 పరుగులు చేసింది. సూర్యవంశీ (104), విహాన్ మల్హోత్రా (76) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో విశ్వ రామ్కుమార్ నాలుగు, థామస్ బ్రౌన్ మూడు వికెట్లు తీశారు.