
హైదరాబాద్: అండర్ 19 వరల్డ్ కప్ నాలుగో సారి గెలుచుకుని భారత్ రికార్డుల్లోకెక్కింది. ఫిబ్రవరి 3 వ తేదీ జరిగిన ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్తో భారత జట్టు క్రీడాకారులు స్టార్లుగా మారిపోయారు. అంతేకాదు, మన్జోత్ కల్రాను ఇంతకుముందు కూడా అందరూ షారూఖ్ ఖాన్లా ఉంటావ్ అంటూ పొగిడేవారంట. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు.
'నేను బాగా రెడీ అయ్యి.. మంచి డ్రస్ వేసుకుంటే.. నన్ను చూసిన వారందరూ నువ్వు షారుక్ ఖాన్లా ఉన్నావ్, నిన్ను చూస్తే ఆయన్ని చూసినట్టే ఉంది' అని అంటుండేవారని కల్రా తెలిపాడు.
అనంతరం ప్రపంచకప్ గెలుపుపై మాట్లాడుతూ..'చాలా సంతోషంగా ఉంది. ఈ విజయానికి మేము అర్హులం. ఇందుకోసం మేము ఎన్నో త్యాగాలు చేశాం. టోర్నీలో భాగంగా కొన్ని మ్యాచ్ల్లో ఒత్తిడికి గురయ్యాం. దాన్ని అధిగమించి విజయాలతో పాటు ప్రపంచకప్ను సొంతం చేసుకున్నాం' అని కల్రా వివరించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్లోనే మన్జోత్ కల్రా 86 పరుగుల వరకు చేశాడు. క్వార్టర్ ఫైనల్ లో న్యూ గినియా జట్టుతో తలపడాల్సి ఉండగా మన్జోత్ కల్రాను జట్టు తీసుకోలేదు. అయినా పట్టుదలతో ప్రాక్టీస్ చేసి సెమీస్లో పాకిస్థాన్తో ఆడిన మ్యాచ్లో పాల్గొన్నాడు.
ఆ మ్యాచ్లో 47 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా, ఈ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో సోమవారం ముంబైలో అడుగుపెట్టింది. స్వదేశంలో కోచ్తో పాటు క్రీడాకారులందరికీ ఘన స్వాగతం లభించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.