
హైదరాబాద్: సొంత గడ్డపై భారత మహిళలు రాణించలేకపోతున్నారు. ముక్కోణపు టీ20 సిరీస్లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. భారత మహిళల జట్టుపై ఇంగ్లాండ్ అమ్మాయిల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (76) 40 బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు, మిథాలీ రాజ్(53) 43 బంతుల్లో 7ఫోర్లు అర్ధశతకాలతో రాణించడంతో 4 వికెట్లు కోల్పోయిన భారత్ 198 పరుగులు చేసింది. వీరిద్దరూ జట్టుకు మంచి పునాది వేశారు. జట్టు స్కోరు 129 వద్ద భారత్ మంధాన రూపంలో తొలి వికెట్ చేజార్చుకుంది.
ఆఖర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(30), పూజా వస్ర్తాకర్(22 నాటౌట్) విజృంభించారు. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరం విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్లో పుంజుకొని అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్:
ఇంగ్లీష్ ఓపెనర్ డేనియెల్లీ వాట్(124: 64 బంతుల్లో 15ఫోర్లు, 5సిక్స్లు) వీరోచిత శతకంతో చెలరేగింది. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు బాదింది. ఆరంభం నుంచే ఆతిథ్య బౌలర్ల పసలేని బౌలింగ్ను పసిగట్టిన వాట్ ఇన్నింగ్స్ ఆఖరి వరకు ఒంటరిగా పోరాడింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసి చెప్పకోదగ్గ ప్రదర్శన చేసింది.
సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి కేవలం ఒక్క వికెట్ పడగొట్టింది. బ్యాట్స్ఉమెన్ భారీ స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడటంలో బౌలర్లు విఫలమయ్యారు.