వన్డే ప్రపంచకప్ అనంతరం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఓ సుదీర్ఘ టూర్ జరగనుంది. ఈ టూర్ కోసం టీమిండియా ఆగస్టు మొదటి వారంలో వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వాస్తవానికి ఈ టూర్ ప్రపంచకప్ ఫైనల్ ముగియగానే జరగాల్సి ఉంది.
అయితే భారత్ ఇప్పటికే దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా టూర్లను ముగించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతోంది. త్వరలో మెగా టోర్నీ ప్రపంచకప్లో ఆడనుంది. దీంతో భారత ఆటగాళ్లు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విరామం అవసరమని భావించి.. విండీస్ టూర్ను రెండు వారాల పాటు వాయిదా వేయమని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ)ను బీసీసీఐ కోరింది.
బీసీసీఐ విజ్ఞప్తికి వెస్టిండీస్ బోర్డు సానుకూలంగా స్పందించింది. దీంతో ఆగస్టు మొదటి వారంలో టూర్ జరగనుంది. అయితే ఈ టూర్ పూర్తి షెడ్యూల్ ను మాత్రం ప్రకటించలేదు. మే 13న వెస్టిండీస్ బోర్డు సమావేశమై షెడ్యూల్ వివరాలను ప్రకటించనుంది. భారత్ టూర్ కారణంగా కరీబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్)ను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ ఆగస్ట్ 21 నుండి సెప్టెంబర్ 27 వరకు జరగాల్సి ఉంది. భారత్ టూర్ కారణంగా సెప్టెంబర్ 4 నుండి అక్టోబర్ 12 వరకు నిర్వహించనున్నారు.