
ముంబై: వెస్టిండీస్ పర్యటనకు వస్తున్న టీమిండియాకు ఆతిధ్య జట్టు గట్టి పోటీ ఇస్తుందని ఆ దేశ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. విండీస్ పర్యటన కోసం టీమిండియా సోమవారం అమెరికా బయలుదేరింది. అక్కడ రెండు టీ20లు ఆడిన అనంతరం కరీబియన్లో అడుగుపెడుతుంది. విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్లు ఆడనుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వివియన్ రిచర్డ్స్ మాట్లాడుతూ... 'వెస్టిండీస్-భారత్ సిరీస్ ఎప్పుడూ ఉత్కంఠంగా సాగుతుంది. ఈసారి కూడా అలానే జరుగుతుందని భావిస్తున్నా. ప్రస్తుతం వెస్టిండీస్ బాగా రాణిస్తోంది. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. విండీస్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. టీమిండియాకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ పర్యటన రసవత్తరంగా సాగే అవకాశం ఉంది' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు.
1971లో వెస్టిండీస్లో చిరస్మరణీయ టెస్టు అరంగేట్రం చేసిన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'కరేబియన్కు ఆటగాళ్లను ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటా. నా కెరీర్ ఇక్కడే ప్రారంభించా. నా హృదయంలో వెస్టిండీస్కు ప్రత్యేక గౌరవం ఉంది' అని తెలిపారు.
మీడియా సమావేశంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు అబద్ధాలు. ఈ వార్తలు ఎవరు సృష్టించారో అర్ధం కావట్లేదు. ఇలాంటి విషయాలు చదవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు త్వరలో చదువుతారు. ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయికి దిగజారింది. ఆటకన్నా జట్టులో ఎవరు గొప్ప కాదు. ఎవరైనా జట్టు కోసమే ఆలోచించేవాళ్లే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా రాణించేవాళ్ళం కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా.. జట్టులో ఎలాంటి విభేదాలు లేవు' అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.