
ముంబై: ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న భారత జట్లకు శుభవార్త అందింది. కఠిన క్వారంటైన్ ఆంక్షలను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోదు (ఈసీబీ) సడలించింది. భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్చలతో 10 రోజుల కఠిన క్వారంటైన్ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే ఇంగ్లండ్ గడ్డపై సాధన చేసుకోవచ్చు. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లండ్ వెళ్తున్న సంగతి తెలిసిందే. వారికి మాత్రం పది రోజుల కఠిన క్వారంటైన్ ఉండనుంది. అయితే వీరి విషయంలో కూడా బోర్డు చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం టీమిండియాకు చెందిన పురుషులు, మహిళల జట్లు.. వారి కుటుంబాలతో సహా ముంబైలో క్వారంటైన్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటన కోసం జూన్ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్ విమానంలో బ్రిటన్కు వెళ్తాయి. కోహ్లీసేన నేరుగా సౌతాంప్టన్లో దిగి అక్కడి హోటళ్లలో క్వారంటైన్ అవుతుంది. మిథాలీ సేన బ్రిస్టల్కు వెళ్లి స్థానికంగా క్వారంటైన్ కానుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీసూ ఇదే సమయంలో జరుగుతుంది. దాంతో కివీస్ ఆటగాళ్లు, భారత క్రికెటర్లు ఒకే హోటళ్లలో ఉంటారని సమాచారం.
మిథాలీ సేన జూన్ 16న ఇంగ్లండ్తో ఏకైక టెస్టులో తలపడుతుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. మరోవైపు జూన్ 18-22 వరకు కోహ్లీసేన, విలియమ్సన్ బృందంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఢీ కొననుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్తో ఐదు టెస్టు సిరీసు ఆడుతుంది. భారత క్రికెట్ చరిత్రలో పురుషులు, మహిళల జట్లు కలిసి ఒకే ఛార్టర్ విమానంలో వెళ్లడం ఇదే మొదటిసారి.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ఇక కేఎల్ రాహుల్, సాహాలను ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయనున్నారు.
స్టాండ్బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.