హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పలు రికార్డులు నమోదు అవుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు కూడా దీటుగానే బదులిస్తోంది. మూడో టెస్టు మూడో రోజు టీ విరామానికి 99 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో పుజారా 109, కరుణ్ నాయర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. రెండో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ 67 పరుగుల వద్ద అవుటవ్వగా, మూడో రోజు 120/1 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 193 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది.
82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ ఓకీఫ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా టాప్ 3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ వ్యక్తిగత పరుగులు సాధించి భారత్ ఇన్నింగ్స్కు చక్కటి పునాది వేశారు. ఇలా ఒక టెస్టు మ్యాచ్లో భారత్ టాప్ 3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి.
2010లో చివరిసారి భారత్ టాప్ 3 ఆటగాళ్లు ఈ ఘనతను సాధించారు. న్యూజిలాండ్తో నాగ్పూర్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ టాపార్డర్ విశేషంగా రాణించింది. కాగా, 2006 నుంచి 2010 వరకూ చూస్తే భారత టాప్ 3 ఆటగాళ్లు యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఎనిమిదిసార్లు సాధించగా.. ఆ తర్వాత ఆ ఫీట్ను ఒకసారి మాత్రమే సాధించారు.
మరోవైపు ఈ టెస్టులో పుజారా సెంచరీ నమోదు చేశాడు. 218 బంతులను ఎదుర్కొన్న పుజారా 14 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 11వ సెంచరీ కావడం విశేషం. మూడో రోజు 100 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది.