
వాళ్లను ఆడించకూడదు:
శనివారం ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్లో మైకేల్ వాన్ స్పందించాడు. తొలి టెస్టు తర్వాత శార్ధూల్ ఠాకూర్ గాయం కారణంగా తప్పుకోవడంతో భారత్ నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా, షమీ చివర్లో 89 పరుగుల భాగస్వామ్యం జోడించి జట్టును విజయపథంలో నడిపించారు. అయితే ఈ ప్రదర్శన భారత్ అంచనాల్ని తలకిందులు చేసిందని వాన్ అభిప్రాయపడ్డాడు. '8-11వ స్థానం వరకు వాళ్లను ఆడించకూడదు. లార్డ్స్లో బుమ్రా, షమీ సాధించిన పరుగులు ఆ జట్టు టెయిలెండర్లపై తప్పుడు అంచనాలు నెలకొల్పాయి. వాస్తవికంగా ఎనిమిదో స్థానంలో షమీని పంపకూడదు' అని వాన్ అన్నాడు.

యాష్ లేకుంటే ఆశ్చర్యపోతా:
'ఖచ్చితంగా వచ్చే వారం (నాలుగో టెస్ట్) భారత్ రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి తీసుకుంటుంది. లీడ్స్ ఫలితంతో వారి ఆలోచనా ధోరణి మారనుంది. దీంతో 8-11 నుంచి నాలుగు కుందేళ్లను కలిగి ఉండలేరు. అప్పుడు మహమ్మద్ షమీ 8వ స్థానంలో ఆడలేడు. అశ్విన్ కచ్చితంగా నాలుగో టెస్ట్ ఆడాలి. 5 టెస్ట్ మ్యాచ్ సెంచరీలు చేయడమే కాకుండా 400 వికెట్లు కూడా తీశాడు. అందుకే అతను భారత టెస్ట్ జట్టులోకి రావాలని నా అభిప్రాయం. ఒకవేళ యాష్ లేకుంటే నేను ఆశ్చర్యపోతాను. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో చాలా అనుభవం ఉంది. ఇంకా రెండు టెస్టులు ఉన్నాయి. సిరీస్ గెలిచే అవకాశం ముందేవుంది' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.

భారత్ తిరిగి పుంజుకుంటుంది:
భారత్ మూడో టెస్టులో సరైనా ఆలోచనా విధానం లేకుండా, అంకితభావం లేకుండా ఆడిందని ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు. తొలి రోజు బ్యాటింగ్లో తక్కువ స్కోరుకే ఔటయ్యాక ఆటగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందన్నాడు. ఈ మ్యాచ్ పోతే పోయింది.. తర్వాతి మ్యాచ్ నుంచి చూసుకుందాం అనే భావనలో ఉన్నారన్నాడు. అయితే ఓవల్లో జరిగే నాలుగో టెస్టుకల్లా భారత్ తిరిగి పుంజుకుంటుందని వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్లో టీమిండియాకు శుభారంభం దక్కితే బాగా ఆడుతుందని వివరించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తర్వాతి మ్యాచ్లో రాణిస్తాడన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్పై స్పందిస్తూ.. ఆ జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన నాయకుడిగా నిలిచినందుకు ప్రత్యేకంగా ప్రశంసించాడు.

జడేజా ఔట్:
మూడో టెస్ట్ అనంతరం గంటల వ్యవధిలోనే భారత్ జట్టు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. అతడికి మోకాలి గాయం అయినట్టు సమాచారం. లీడ్స్ టెస్టులో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టిందట. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమిండియా మేనేజ్మెంట్ అతని గాయానికి స్కానింగ్ చేయించినట్లు తెలిసింది. దాదాపు అతడు నాలుగో టెస్ట్ ఆడకపోవచ్చు. జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా హనుమ విహారి ఆడొచ్చు.

జట్టులోకి అశ్విన్:
ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సి ఉంటుందని కెప్టెన్ సూచించాడు. మొదటి టెస్టులో ఇషాంత్ శర్మ ఆడలేదు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను మొత్తం 56 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో అతనికి ఐదు వికెట్లు లభించాయి. మూడో టెస్ట్ మ్యాచ్లో ఇషాంత్ 22 ఓవర్లలో 92 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. మరోవైపు చీలమండ గాయం, కండరాల ఒత్తిడి కారణంగా ఇషాంత్ ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి ఇప్పటివరకు జరిగిన మూడవ లేదా నాల్గవ స్పెల్ సమయంలో ఇషాంత్ అంత ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో అతడిపై వేటు పడనుంది. ఇషాంత్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రావడం ఖాయం అయింది.


Click it and Unblock the Notifications












