వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 34 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా ఇండియా చివరిగా 1990/91లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగాటోర్నీ జరగలేదు. 2025లో జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది.
ఈ సారి టీ20 ఫార్మాట్లో ఆసియా మెగాటోర్నీ జరగనుంది. 2023లో గత ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరిగిన విషయం తెలిసిందే. అయితే 2026లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో పొట్టి ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఐసీసీ మెగాటోర్నీకి సన్నాహకంగా ఆసియా కప్ ఫార్మాట్ను నిర్ణయిస్తారు. అలాగే 2027లో ఆసియా కప్కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

అయితే బంగ్లాదేశ్లో జరగనున్న ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో 50 ఓవర్ల ఫార్మాట్లోనే ఆసియా మెగాటోర్నీ నిర్వహించనున్నారు. ఆసియా కప్లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. 13 మ్యాచ్లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్తో పాటు మరో జట్టు పాల్గొననుంది.
1984లో యూఏఈ వేదికగా ఆసియా కప్ను తొలిసారి నిర్వహించారు. భారత్లో ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఈ మెగాటోర్నీ జరిగింది. అత్యధికంగా బంగ్లాదేశ్ అయిదు సార్లు ఆతిథ్యం ఇచ్చింది. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన గత ఆసియా కప్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే 2023లో జరిగిన ఈ టోర్నీ హైబ్రిడ్ మోడ్లో జరిగింది. విజేతగా నిలిచిన భారత్ మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి. కాగా, 2026లో జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల లంకలో జరిగిన ఈ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.