వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారికంగా వెల్లడించింది. మీడియా రైట్స్కు సంబంధించి వెల్లడించిన ప్రకటనలో 2024 నుంచి 2031 వరకు ఆసియా కప్ ఆతిథ్య దేశాల వివరాలు తెలిపింది. టీ20 ఫార్మాట్లో 2025 ఆసియా కప్ జరగనుంది.
పురుషుల ఆసియా కప్తో పాటు మహిళల ఆసియా కప్, మెన్స్ అండర్-19 ఆసియా కప్, మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్, ఉమెన్స్ అండర్ 19 ఆసియా కప్, ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వంటి ఈవెంట్లను ప్రసారం చేసే టెలివిజన్, డిజిటల్ హక్కుల కోసం ప్రాథమిక ధర 170 మిలియన్ల యూఎస్ డాల్లరుగా ఏసీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వేలం నవంబర్ 1న జరగనుంది.

2025లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. 2027లో బంగ్లాదేశ్ వేదికగా వన్డే ఫార్మాట్లో ఆసియా కప్; అలాగే 2029లో పాకిస్థాన్ వేదికగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది. ఇక 2031లో వన్డే ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఏసీసీ తెలిపింది.
ప్రతి ఆసియా కప్ టోర్నీలో 13 మ్యాచ్లు జరగనున్నాయి. ఓ టోర్నీలో భారత్ - పాకిస్థాన్ కనీసం రెండు సార్లు తలపడనున్నాయి. ఇరు జట్లు ఫైనల్కు చేరితే మూడు సార్లు జరుగుతుంది. ఇది బ్రాడ్కాస్టర్లకు భారీ మొత్తం వెచ్చించేలా ఉత్సాహపరుస్తుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరిగింది. పాకిస్థాన్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చాయి. పాక్తో ఆడిన రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 30వ తేదీలోపు ఈ-ఆక్షన్ ద్వారా టెక్నికల్ బిడ్లను దుబాయ్లో సమర్పించాలని బ్రాడ్కాస్టర్లకు ఏసీసీ సూచించింది.