క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ ఏడేళ్ల తర్వాత తిరిగి వస్తోంది. నవంబర్లో ఈ టోర్నీ జరగనుందని హాంకాంగ్ క్రికెట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. భారత్ కూడా పాల్గొంటుందని వెల్లడించింది. ఈ సిక్సర్ల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. భారత్తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, హాంకాంగ్, నేపాల్, న్యూజిలాండ్, ఒమన్, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి.
1992లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మొదలైంది. 2017 వరకు ఈ టోర్నీ కొనసాగింది. ఆ తర్వాత ఇది నిర్వహించలేదు. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, షేన్ వార్న్, వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్, సనత్ జయసూర్య, అనిల్ కుంబ్లే, ఉమర్ మాలిక్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. భారత్ 2005లో ఛాంపియన్గా నిలిచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. కాగా, ఈ సారి టోర్నీ నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనుంది.

టోర్నీ రూల్స్ ఇవే:
ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఉంటారు. ఓ మ్యాచ్లో ప్రతి జట్టు అయిదు ఓవర్లు ఆడుతుంది. సాధారణ మ్యాచ్ల్లో ప్రతి ఓవర్కు 6 బంతులే వేస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్కు మాత్రం ఓవర్కు ఎనిమిది బంతులు చొప్పున సంధించాల్సి ఉంటుంది.
వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ చొప్పున బ్యాటింగ్ చేయాలి. వైడ్ లేదా నో బాల్కు ఎక్స్ట్రా రూపంలో రెండు పరుగులు లభిస్తాయి.
అయిదు ఓవర్లు పూర్తికాక ముందే అయిదు వికెట్లు పడితే.. ఆరో ఆటగాడు బ్యాటింగ్ కొనసాగింవచ్చు. చివరిగా ఔటైన బ్యాటర్ను రన్నర్గా ఉంచుతూ బ్యాటింగ్ కొనసాగించవచ్చు. ఆరో ప్లేయర్ మాత్రమే స్ట్రైకింగ్ చేస్తాడు. ఆరు వికెట్లు పడితే ఆలౌట్గా ప్రకటిస్తారు.
ఓ బ్యాటర్ 31 పరుగులకు చేరుకుంటే బలవంతంగా రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ ఔట్ లేదా రిటైర్ అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.