
న్యూజిల్యాండ్తో తొలి వన్డేలో అనూహ్యంగా ఓడిన టీమిండియా.. రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలని గట్టి నిశ్చయంతో ఉంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన ఈ మ్యాచ్లో మరోసారి టాస్ కివీస్ జట్టునే వరించింది. టాస్ నెగ్గిన కేన్ విలియమ్సన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. పిచ్ను కవర్స్తో కప్పి ఉంచారని, కాబట్టి పేసర్లకు సహకారం లభిస్తుందని అనుకుంటున్నామని చెప్పాడు. తాము కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని ధవన్ అన్నాడు.
కివీస్ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు కేన్ విలియమ్సన్ ప్రకటించాడు. పేసర్ ఆడమ్ మిల్నే స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ను తీసుకున్నట్లు తెలిపాడు. అదే సమయంలో భారత జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు ధవన్ వెల్లడించాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ ఆడుతున్నాడని, అలాగే సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నామని వెల్లడించాడు. ఒకే ఒక్క అవకాశం తర్వాత మళ్లీ శాంసన్ను పక్కన పెట్టేయడంపై అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు.
తొలి వన్డేలో భారత్ను ఒక విధంగా ఓడించింది శార్దూల్ ఠాకూర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అతను వేసిన ఓవర్తోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ప్రస్తుతం పెద్ద ఫామ్లో కూడా లేని అతని స్థానంలో దీపక్ చాహర్ను తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గాయంతో జట్టుకు దూరం అవడానికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో చాహర్ రాణించాడు. అయితే ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు అతనికి అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు.
భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్,
న్యూజిల్యాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, డారియల్ మిచెల్, మైకేల్ బ్రేస్వెల్, టిమ్ సౌథీ, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.