IND vs ENG: వచ్చే నెలలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ నేడు టీమిండియాను ప్రకటించనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టును ప్రకటించనుంది. రోహిత శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో సెలెక్టర్లకు ఇది పెద్ద పరీక్షే. టెస్ట్ జట్టుకు కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటన కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) సైకిల్ ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది. ఈ సిరీస్లో మంచి ప్రదర్శన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనే భారత లక్ష్యానికి చాలా కీలకం. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభం కానుంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత సెలెక్టర్లు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంటుంది. వీటిలో అతిపెద్ద సమస్య ఏంటంటే మంచి కెప్టెన్ను కనుగొనడం. జట్టును నడిపించడానికి శుభ్మన్ గిల్ ముందంజలో ఉన్నాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా రేసులో ఉన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు, కొత్త కెప్టెన్ను ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ప్రకటిస్తారో తెలుసుకుందాం.

భారత జట్టు, కెప్టెన్ను ఎప్పుడు, ఎక్కడ ప్రకటిస్తారు?
ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా, కొత్త కెప్టెన్ను ఎప్పుడు ప్రకటిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును కొత్త కెప్టెన్ను బీసీసీఐ ప్రకటించనుంది. ఇవాళ టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం ద్వారా జట్టును ప్రకటించబోతున్నారు. నిజానికి టీమిండియాకు చెందిన ఇద్దరు గొప్ప ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో పాల్గొనడం లేదు ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అటువంటి పరిస్థితిలో ఈ ఇద్దరి తర్వాత ఓపెనర్, నంబర్ 4 ఎవరు అవుతారో చూడటం చాలా ముఖ్యం. శుభ్మన్ గిల్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయమని అడగవచ్చు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో ఆడతారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నారు. గిల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలనుకుంటే కరుణ్ నాయర్ను నాలుగో స్థానంలో ప్రయత్నించవచ్చు.
భారత జట్టు ప్రకటనను మీరు ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు?
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటనను మే 24న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్1, స్టార్ స్పోర్ట్స్ 2లో ప్రత్యక్షప్రసారంలో చూడవచ్చు. దీని ప్రత్యక్షప్రసారం జియో హాట్స్టార్లో అందుబాటులో ఉంటుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఇంగ్లాండ్ పర్యటన ప్రసారకర్త అని తెలిసిందే. ఇందులో డిజిటల్ ప్లాట్ఫాం సోనీ లివ్ కూడా ఉంది.
గిల్కు టెస్ట్ పగ్గాలు?
భారత టెస్ట్ జట్టు తదుపరి కెప్టెన్గా శుభ్మన్ గిల్కు బాధ్యత అప్పగించవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో గిల్ కొత్త కెప్టెన్ కాబోతున్నాడని చాలా నివేదికలు పేర్కొన్నాయి. అయితే కొంత మంది అభిమానులు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కొత్త కెప్టెన్గా ఎవరిని నియమిస్తారో చూడాలి?